చాలా ముందుగానే పెళ్లి ప్రదేశానికి చేరుకున్న నిహారిక!
on Nov 20, 2020
నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న వెంకటచైతన్య జొన్నలగడ్డతో జరగనుంది. రాజస్థాన్లో సిటీ ఆఫ్ లేక్స్గా పేరుపొందిన ఉదయ్పూర్లో జరిగే ఆ వివాహం కోసం ఆమె కుటుంబం అక్కడకు వెళ్లింది. ది ఓబరాయ్ ఉదయ్విలాస్ హోటల్లో గ్రాండ్గా జరిగే వేడుకలో నిహారిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు చైతన్య. అతను గుంటూరు ఐజీ జె. ప్రభాకరరావు కుమారుడు.
ఉదయ్పూర్లో తన పెళ్లి జరిగే హోటల్ నుంచి మూడు రోజుల క్రితం నిహారిక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ను షేర్ చేసింది. అందులో ఆమె క్యాజువల్ డ్రస్తో ఉంది. మెడలో ఓ ఫ్యానీ బ్యాగ్ వేసుకుంది. పెళ్లి వేదిక దగ్గర్నుంచి తీసిన ఫొటో కావడంతో ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
నిహారిక, చైతన్య నిశ్చితార్ధం ఆగస్ట్లో హైదరాబాద్లో జరిగింది. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా రెండు కుటుంబాలు చాలా ముందుగానే ఉదయ్పూర్కు చేరుకొని క్వారంటైన్లో ఉంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలు ఇంకా అమలులో ఉన్నందున భారీ సంఖ్యలో అతిథులు రావట్లేదని, సన్నిహితులు, స్నేహితులు, రెండు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు మాత్రమే హాజరవుతారనే అంతర్గత వర్గాలు తెలిపాయి.