రెండేళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్లోకి!
on Apr 9, 2020
నివేదా పేతురాజ్ తెలుగులో నటించిన మూడు సినిమాలు.. 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి', 'అల వైకుంఠపురములో' ప్రేక్షకుల్ని అలరించాయి. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ 'అల వైకుంఠపురములో' మూవీలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె ట్విట్టర్లోకి కొత్త అకౌంట్తో మళ్లీ వచ్చింది. ద్వేషపూరితమైన కామెంట్లు, ట్రోల్స్ ఎక్కువగా వస్తుండటంతో 2018లో తన ట్విట్టర్ ఖాతాను నివేదా తొలగించుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. రెండు రోజుల క్రితం మళ్లీ ట్విట్టర్లోకి వస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపింది.
"థాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ మి ఆన్ ట్విట్టర్. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి".. అనేది ఆమె పెట్టిన తొలి పోస్ట్. @Nivetha_Tweets అనేది కొత్త ట్విట్టర్ అకౌంట్. ఇప్పటివరకూ ఆమె ట్విట్టర్లో ఎవరినీ ఫాలో కావట్లేదు. తెలుగులో ప్రస్తుతం రామ్ సినిమా 'రెడ్'లో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తోంది నివేదా. తమిళ హిట్ ఫిల్మ్ 'తాడమ్'కు ఇది రీమేక్. అలాగే 'చిత్రలహరి' తర్వాత సాయిధరమ్ తేజ్తో మరో సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. దేవా కట్టా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆమధ్య లాంఛనంగా మొదలైంది.
Also Read