థాంక్యూ డియర్ బ్రదర్ బాలయ్యా!
on Apr 3, 2020
వృత్తిపరంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకసారి చిరంజీవి సినిమా ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, ఇంకోసారి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించేది. ఇక వాళ్ల అభిమానుల మధ్య అయితే పోటీ కాదు, విరోధమే ఎక్కువ. ఇద్దరు స్టార్ల అభిమానులు బాహాటంగా గొడవలు పడ్డ సందర్భాలు తక్కువేమీ కాదు. ఇవాళ్టి రోజుల్లో అయితే సోషల్ మీడియా సాక్షిగా వాళ్లు పడే గొడవ మరీ ఎక్కువ. తమ హీరోను పొగుడుతూ, ఎదుటి హీరోను ట్రోల్ చేస్తూ హంగామా సృష్టిస్తుంటారు.
ఫ్యాన్స్ గొడవ ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. తాము వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్లుగా ఎదిగితే, చిరంజీవి స్వయంకృషితో స్టార్గా ఎదిగారని ప్రైవేట్ సంభాషణల్లో బాలయ్య చెప్పేవారు. ఇదంతా చెప్పడం ఎందుకంటే, తాజాగా బాలయ్యను చిరంజీవి పొగిడారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి సంక్షోభంలో బాలయ్య రూ. 1.25 కోట్ల విరాళం అందించడం. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించిన చిరు, "కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు చెరొక రూ. 50 లక్షలు విరాళం అందిస్తున్నందుకు థాంక్యూ డియర్ బ్రదర్ బాలయ్యా. అవసరమైన ప్రతిసారీ నీ సహృదయాన్ని నిరూపిస్తూనే ఉన్నారు. ప్రతి కష్టసమయంలోను, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారు" అని పోస్ట్ చేశారు.
అలా బాలయ్యపై తన అభిమానాన్ని ప్రదర్శించారు చిరంజీవి. అయితే దీనిపై కూడా ఇరువురి ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వాదులాడుకున్నారు. కొంతమంది మాత్రం "మనం ఎంత హేళన చేసినా మనం ఎన్ని మాటలన్నా మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చే చేతులు బాలయ్య బాబువి,మెగా ఫ్యామిలీవి అనేది 100% నిజం" అని కామెంట్లు పెట్టారు.