'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా
on Sep 16, 2019
హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో బుధవారం (సెప్టెంబర్ 18న) మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ను లక్షలాది అభిమానుల సమక్షంలో గ్రాండ్గా చేయాలనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లూ జరిగాయి. అయితే... ఈవెంట్ను వాయిదా వేయాలని ఈ రోజు నిర్ణయానికి వచ్చారు. ముందుగా అనుకుంటున్నట్టు 18న ఈవెంట్ జరగడం లేదు. గోదావరిలో పాపికొండల మధ్య సంభవించిన బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మరణించడంతో ‘సైరా’ ఈవెంట్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ప్రజలు శోకసంద్రంలో ఉంటే... వేడుక చేసుకోవడం సరికాదని మెగాస్టార్ చిరంజీవి, ‘సైరా’ టీమ్ భావించింది. ఈ నెల 18న జరగాల్సిన ఈవెంట్ను 22కు వాయిదా వేసినట్టు తెలిసింది. ఈవెంట్ వాయిదా వేసినా... ముందుగా నిర్ణయించినట్టు ‘సైరా’ ట్రైలర్ను మాత్రం 18న విడుదల చేయనున్నారు.