'బందోబస్త్'తో సూర్య పప్పులుడుకుతాయా?
on Sep 14, 2019
తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన 'కాప్పాన్' మూవీ తెలుగు వెర్షన్ 'బందోబస్త్'.. ఒరిజినల్తో పాటే సెప్టెంబర్ 20న తెలుగునాట రిలీజవుతోంది. తిరుపతి ప్రసాద్గా ఫిల్మ్ ఇండస్ట్రీ పిలుచుకొనే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ ఈ మూవీని తెలుగు స్టార్ హీరోల సినిమా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకు అగ్రెసివ్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఆయనిస్తున్న ప్రమోషన్కు ఆ మూవీ ప్రి రెలీజ్ ఈవెంట్లో సూర్య సైతం తెగ పొగిడేశారు. అయితే 'బందోబస్త్'ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారా?.. అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ తమిళ స్టార్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అంతెందుకు.. ఆ మధ్య ఎంతో ఆర్భాటంతో, ప్రచారంతో విడుదల చేసిన సూర్య మునుపటి సినిమా ‘ఎన్జీకే’ తెలుగులో డిజాస్టర్ అయింది. అదే సినిమా తమిళంలో హిట్టవడం గమనార్హం.
కొంత కాలం క్రితం తమిళ అనువాద చిత్రాలు తెలుగు తెరపై సృష్టించిన అలజడిని ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోలేదు. రజనీకాంత్, కమలహాసన్ మొదట్నుంచీ తెలుగు హీరోల మాదిరిగానే ఆదరణ పొందుతూ రాగా, ఆ తర్వాత వారికి విక్రం, సూర్య, శింబు, సిద్ధార్థ్, విశాల్, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్ వంటి హీరోలు తోడయ్యారు. దాంతో ఒక్కొక్కప్పుడు తెలుగు సినిమాలకే తగినన్ని థియేటర్లు లభించని స్థితి ఏర్పడింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాను విడుదల చేసినట్లుగానే వాళ్ల సినిమాలను కూడా ఇక్కడ భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తూ వచ్చారు.
ఒక విధంగా చెప్పాలంటే మన హీరోలకు వీళ్లు పక్కలో బల్లేల్లా తయారయ్యారు. ఓ వైపు మన యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, మరోవైపు తమిళ యువ హీరోల సినిమాలు శరపరంపరలా దూసుకువచ్చి థియేటర్లను ఆక్రమించేవి. అంతేనా.. అవి ఆడుతున్న థియేటర్లు యువతరం ప్రేక్షకులతో కిటకిటలాడేవి. దాంతో సహజంగానే వాళ్ల చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. ‘అపరిచితుడు’, ‘గజిని’, ‘పందెంకోడి’, ‘ప్రేమిస్తే’, ‘మన్మథ’, ‘ఆవారా’, ‘రఘువరన్ బీటెక్’, ‘తుపాకి’, ‘రెమో’, ‘అభిమన్యుడు’ తదితర అనువాద చిత్రాలు ప్రేక్షకుల ఆదరాన్ని బాగా పొందాయి. ఆ హీరోల్లో సిద్ధార్థ్ అయితే ఏకంగా టాలీవుడ్లోనే కొంత కాలం తిష్ఠవేశాడు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'అనగనగా ఓ ధీరుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు.
ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇదివరికటిలా తమిళ హీరోల సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రజనీకాంత్ ‘పేట’ తమిళంలో బ్లాక్బస్టర్ కాగా, ఇక్కడ అంతంత మాత్రంగానే ఆడింది. దానితో పాటు విడుదలైన అజిత్ సినిమా ‘విశ్వాసం’ సైతం తమిళంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. కానీ తమిళంతో పాటు తెలుగులో విడుదల చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు రాలేదు. చివరకు చాలా రోజుల తర్వాత విడుదల చేస్తే, మొదటి రోజే ఈ సినిమాకి ప్రేక్షకులు లేకపోవడంతో రెండో రోజు నుంచే కొన్ని థియేటర్ల నుంచి ఆ సినిమా మాయమైంది.
ఇక సిద్ధార్థ్, శింబు వంటి హీరోల సినిమాలను తెలుగులో విడుదల చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొంత కాలం క్రితం తెలుగు హీరోలా మారిపోయాడనిపించిన కార్తీ సినిమాలకు సైతం తెలుగులో డిమాండ్ తగ్గిపోయింది. అతడు హీరోగా నటించీన 'కాష్మోరా', 'చెలియా', 'ఖాకీ', 'చిన్నబాబు', 'దేవ్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఇదివరకటిలా ధనుష్, విశాల్ ప్రాభవం తెలుగునాట కనిపించడం లేదు.
దీనికి కారణం.. కొంత కాలంగా తెలుగులోనూ యువ హీరోల సంఖ్య బాగా పెరగడమే. దీంతో అరవ హీరోలు వెనుకబడిపోయారు. తెలుగునాట ఇదివరకటిలా వాళ్ల పప్పులు ఉడకడం లేదు. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'బందోబస్త్'ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే ఆసక్తి టాలీవుడ్లో వ్యక్తమవుతోంది.