ఇళయరాజాతో గొడవల్లేవ్... అభిప్రాయ భేదాలే: ఎస్పీబీ
on Aug 21, 2019
సంగీత జ్ఞాని ఇళయరాజా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య ఏం జరిగిందో ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. తాను స్వరపరిచిన పాటలు సంగీత విభావరిలలో ఎస్పీబీ పాడటానికి వీలు లేదంటూ ఇళయరాజా న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. సాంగ్స్ రాయల్టీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ నడిచింది. అదిప్పుడు సద్దుమణిగింది. దానిపై ఎస్పీబీ మాట్లాడుతూ "రాయల్టీ విషయంలో మా మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. న్యాయవాదులు జోక్యం చేసుకోవడం, సోషల్ మీడియాలో అభిప్రాయ భేదాలను పెద్దవిగా చేసి చూపించడంతో పరిస్థితులు మారాయి. మా మధ్య ఏడాది గ్యాప్ వచ్చింది. పంతాలు, పట్టింపులకు పోతే మరింత దూరం పెరిగేది. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఇటీవల ఆయనకు ఓ పాట పాడాను. ఇటీవల రెండు షోలు చేశాం. మరో ఏడాది న డేట్స్ ఆయనకు కావాలని అంటున్నారు" అని అన్నారు. ప్రముఖ గాయకులు కేజే ఏసుదాసు, చిత్రతో కలిసి నవంబర్ 30న గచ్చిబౌలి స్టేడియంలో 'లెజెండ్స్' పేరుతో ఒక సంగీత విభావరి నిర్వహించనున్నారు.