'రణరంగం'లో కథ లేదని ఒప్పేసుకున్నాడు!
on Aug 17, 2019
కథగా చెప్పుకోడానికి 'రణరంగం'లో ఏమీ లేదని రివ్యూల్లో రాశారనీ, అది నిజమనీ అంగీకరించాడు హీరో శర్వానంద్. తాము కథ పట్టుకొని ఈ సినిమా చెయ్యలేదని ఆయన స్పష్టం చేశాడు. ఒక గ్యాంగ్స్టర్ జీవితాన్ని రెండు దశల్లో చూపిస్తూ సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన 'రణరంగం' సినిమా ఆగస్ట్ 15న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయని శర్వానంద్ అంటున్నాడు. శనివారం మీడియాతో ఇంటరాక్ట్ అయిన శర్వానంద్ మాట్లాడుతూ "ఇది స్క్రీన్ప్లే బేస్డ్ ఫిల్మ్, స్టైలైజ్డ్ ఫిల్మ్ అని చెబుతూ వచ్చాం. మనోడే అని రివ్యూస్లో కొంచెం కనికరించి రాసుంటే, రెవెన్యూ ఇంకా బెటర్గా ఉండేదనేది నా ఆశ. స్క్రీన్ప్లే అసాధారణంగా ఉందని అంటారని ఎక్స్పెక్ట్ చేశా. కానీ అలా జరగలేదు" అని ఆయన తెలిపాడు.
ప్రేక్షకులు ఏదైనా సినిమా చూడలేదంటే అది తమ తప్పే కానీ వాళ్ల తప్పు కాదని శర్వా చెప్పాడు. "సినిమా చూడ్డానికి వాళ్లు రెడీ. మనం ఎంతగా ఎంగేజింగ్గా తియ్యగలిగితే వాళ్లొచ్చి చూస్తారు. ఎవరేం చెప్పినా చూస్తారు. వాళ్లు చూడలేదంటే మన సైడే తప్పు ఉందని అర్థం. శర్వా అంటే మంచి కథ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈసారి అది మిస్సయ్యాను" అని రియలైజ్ అయ్యాడు శర్వా.