బిగ్ 'కాంట్రవర్సీ' బాస్
on Jul 15, 2019
తెలుగునాట 'బిగ్బాస్' తొలి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాక్ చాతుర్యంతో వార్తల్లో నిలిచింది. రెండో సీజన్ సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన హడావిడితో వార్తల్లో నిలిచింది. యాంకరింగ్ చేసిన నానిపై కౌశల్ ఆర్మీ చేసిన వివాదాస్పద కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. నాగార్జున యాంకరింగ్ చేయనున్న మూడో సీజన్ మొదలు కాకముందే వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తీసి పారేసే వివాదాలు కావివి. 'బిగ్ బాస్' నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా ఆరోపించారు. ఆరోపించడమే కాదు... పోలీసుల దగ్గరకు వెళ్లి కేసులు పెట్టారు.
తమ బిగ్ బాస్ను ఏ విధంగా ఇంప్రెస్ చేస్తావని తనను నిర్వాహకులు అడిగారని, షో ముసుగులో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని శ్వేతారెడ్డి ఆరోపించారు. షో ముసుగులో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా? అని ఘాటైన విమర్శలు చేశారు. వంద రోజులు శృంగారానికి దూరంగా ఉండగలవా? అని తనను బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారని 'ఫిదా' ఫేమ్ గాయత్రీ గుప్తా తెలిపారు. షో ఒప్పందం కారణంగా సినిమా అవకాశాన్ని కోల్పోవడంతో సుమారు 16 లక్షలు ఆర్థికంగా నష్టపోయానని ఆమె పేర్కొన్నారు. 'బిగ్ బాస్' నిర్వాహకులు తనను లైంగికంగా వేధించారన్నది గాయత్రీ గుప్తా ఆరోపణ. వీటిపై 'స్టార్ మా' ఛానల్ యాజమాన్యం. 'బిగ్ బాస్' నిర్వాహకులు పెదవి విప్పడం లేదు. చట్టపరంగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. నిజానిజాలేంటి? అనేవి పక్కన పెడితే... ఇద్దరు అమ్మాయిలు మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం ప్రజల్లో 'బిగ్ బాస్' షోపై చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చేలా ఉన్నాయి. వివాదరహితుడిగా పేరున్న నాగార్జునను ఈ వివాదాలు ఇబ్బంది పెట్టేవే.