'దొరసాని'గా రాజశేఖర్ కుమార్తె సూపరట!
on May 21, 2019
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ దంపతుల రెండో కుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'దొరసాని'. తెలంగాణ నేపథ్యంలో 1980 కాలం నాటి కథతో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోంది. కెవిఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శనివారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. జూలై 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత మధుర శ్రీధర్ తెలిపారు. 'అర్జున్ రెడ్డి'తో అనూహ్యంగా యువతలో క్రేజ్ తెచ్చుకున్న హీరో తమ్ముడు ఈ సినిమాలో హీరో కావడం... శివాత్మిక తల్లిదండులు ఇద్దరూ హీరో హీరోయిన్లు కావడంతో 'దొరసాని'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. 'కథ అనుకున్నాక హీరో హీరోయిన్లను ఎంపిక చేసుకున్నారా? హీరో హీరోయిన్లను అనుకున్నాక కథ రాశారా?' అని అడిగితే... "ముందు కథ సిద్ధమైంది. తరవాత అమెరికా నుంచి వచ్చిన ఆనంద్ దేవరకొండను చూశా. పాత్రకు సూటవుతాడని కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాం. ఇక, 'దొరసాని'గా శివాత్మిక అమేజింగ్ ఛాయిస్. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఫెంటాస్టిక్" అని మధుర శ్రీధర్ సమాధానం ఇచ్చారు.