ఓ టెన్షన్ తీరింది... మరో టెన్షన్ ముందుంది!
on Mar 19, 2019
రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ఓ టెన్షన్ తీరింది. ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదల అయితే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల సినిమాను విడుదల కాకుండా ఆపాలని దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాంతో వర్మకు, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ఓ టెన్షన్ తీరింది. సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయ్యింది. అయితే... మరో టెన్షన్ ఉంది. సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. అందుకని, ఈ నెల 22న విడుదల చేయాలనుకున్న సినిమాను కాస్తా 29కి వాయిదా వేశారు వర్మ. బుధవారం సెన్సార్ సభ్యులు సినిమాను చూడనున్నారు. చూసి ఏయే సన్నివేశాలకు కత్తెర వేస్తారు? ఏయే సన్నివేశాలను సినిమాలో ఉంచుతారు? అనేది చూడాలి. సెన్సార్ విషయంలో లొల్లి లొల్లి జరిగిన సంగతి తెలిసిందే. సినిమా చూడకముందే ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి, ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసం సెన్సార్ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వర్మ మండిపడ్డారు. తరవాత రాజీ కుదిరిందనుకోండి. అయితే.. వర్మ తీసింది ఉన్నది ఉన్నట్టుగా యధాతథంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? ఒకవేళ సెన్సార్ కత్తెరలు వేస్తే... వర్మ ఎలా స్పందిస్తారు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ అడ్డు తగిలితే కోర్టుకు వెళ్ళడానికి వర్మ సిద్ధమవుతున్నారట.