మరోసారి తెలుగు సినిమాను రీమేక్ చేస్తాడా?
on Dec 19, 2018
పవన్ కల్యాణ్ 'పంజా', ఎన్టీఆర్ 'శక్తి', మంచు విష్ణు 'అస్త్రం' సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్కి తెలుగు సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఈ యువ హీరో తెలుగు రీమేక్లతో హిందీలో యాక్షన్ హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా పరిచయమైన 'హీరోపంతి' అల్లు అర్జున్ 'పరుగు'కు రీమేక్. తరవాత ప్రభాస్ 'వర్షం' సినిమాను హిందీలో 'బాఘీ' పేరుతో రీమేక్ చేశాడు. 'బాఘీ'కి సీక్వెల్ అంటూ అడివి శేష్ 'క్షణం'ను రీమేక్ చేశాడు. తెలుగు సినిమాల్లో, ఆయా కథల్లో మెయిన్ పాయింట్స్ తీసుకుని 'బాఘీ' సిరీస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు. తెలుగు ప్రేక్షకులు 'బాఘీ', 'బాఘీ 2' చూసి పెదవి విరిస్తే... హిందీ ప్రేక్షకుల్లో యాక్షన్ సినిమా ప్రేమికులు ఆదరించడంతో వసూళ్లు బాగా వచ్చాయి. తాజాగా టైగర్ ష్రాఫ్ 'బాఘీ 3' అనౌన్స్ చేశాడు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మించే ఈ సినిమా మార్చి 6, 2020న విడుదల చేస్తామని కూడా చెప్పాడు. 'బాఘీ 3' ప్రకటన తరవాత తెలుగు ప్రేక్షకులకు వచ్చిన సందేహం ఒక్కటే.. ఈసారి ఏ తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్నాడో? మరోసారి తెలుగు సినిమాను రీమేక్ చేస్తాడా? అని! వెయిట్ అండ్ సీ... టైగర్ ష్రాఫ్ ఏం చెబుతాడో? టైగర్ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుగు సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఎక్కువ!