గూఢచారి 2... దర్శకుడు మారాడు!
on Dec 17, 2018
'క్షణం' విజయం తరవాత అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'గూఢచారి'. మధ్యలో 'అమీ తుమీ' వచ్చింది. అయితే... అందులో అడివి శేష్ ఒక్కడే హీరో కాదు. శ్రీనివాస్ అవసరాల, అతడు హీరోలుగా నటించిన మల్టీస్టారర్. 'క్షణం' తరవాత అడివి శేష్ కథతో అందించడంతో పాటు హీరోగా నటించిన సినిమా 'గూఢచారి'. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా 'గూఢచారి'కి సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు. అయితే... చిత్రబృందంలో ఓ మార్పు చోటు చేసుకుంది. 'గూఢచారి' దర్శకుడు శశికిరణ్ తిక్కాను పక్కన పెట్టి సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు రాహుల్ పాకాల చేతిలో పెట్టారు. ఇతను 'గూఢచారి' స్క్రిప్ట్ వర్క్ చేశాడట. ఆల్రెడీ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తారట. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, 2020లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాలోనూ ప్రకాష్ రాజ్, సుప్రియ పాత్రలు కొనసాగుతాయని తెలిసింది.