ఎన్టీఆర్ మహానాయకుడు vs లక్ష్మీస్ ఎన్టీఆర్!
on Oct 20, 2018
వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్గోపాల్ వర్మ. వివాదం ఎక్కడ వుంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు. వివాదాన్ని తన సినిమాకు వస్తువుగా ఎలా మలచుకోవాలో వర్మకు బాగా తెలుసు. ఇప్పుడీ దర్శకుడు ఎన్టీఆర్ జీవితంలో వివాదాల్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి కథా వస్తువుగా మలిచాడు. ఓ పక్క నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ తండ్రి జీవితంపై సినిమా తెరకెక్కిస్తుంటే... మరో పక్క ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ మాత్రమే తెరకెక్కిస్తానని వర్మ సంచలనం సృష్టించారు. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ని ఇష్టపడరు. తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులు దాన్ని ఆసరాగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. ఈ విమర్శకులకు బలం ఇచ్చేలా వర్మ సీఎంగా వుంటుందని అందరూ భావిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలని వర్మ బలంగా నిర్ణయించుకున్నట్టు వున్నారు.
'యన్.టి.ఆర్' బయోపిక్ సెకండ్ పార్ట్ 'యన్.టి.ఆర్- మహానాయకుడు' విడుదల రోజున తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను విడుదల చేస్తానని ప్రకటించాడు. 2019 జనవరి 24న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆశీసులు తనకు మాత్రమే వుంటాయని వర్మ ప్రకటించుకోవడం విశేషం. తన సినిమాపై రాజకీయ ప్రభావం వుండదని వర్మ పేర్కొన్నారు. నిర్మాత రాకేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి అనే సంగతి తనకు ముందుగా తెలియదని, ఒక శత్రువు గురించి మరో శత్రువు చెబితే ప్రజలు నమ్మరు కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుషులు తన సినిమాకు దూరంగా వుండాలని వర్మ సూచించారు.