ఇప్పటికీ శ్రీదేవి ఫోన్ చేస్తుందేమో అని చూస్తున్నా..!
on Apr 13, 2018
అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా కూడా ఇప్పటికీ అది నమ్మలేని నిజంగానే ఉంది. మనకే అలా ఉంటే ఆమె కుటుంబసభ్యులకు, ఆమె సన్నిహితులకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఆమెకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఇంకా శ్రీదేవిని మరిచిపోలేకపోతున్నానని చెబుతున్నారు. శ్రీదేవి, మనీశ్ మంచి స్నేహితులు. ఏ పార్టీకి వెళ్లాలన్నా... సినిమా కార్యక్రమాలకు వెళ్లాలన్నా శ్రీదేవి మనీశ్ డిజైన్ చేసిన దుస్తులనే వేసుకునేవారు. అంత దగ్గరి స్నేహితురాలు సడెన్ గా చనిపోవడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆమెను గుర్తుచేసుకుంటూ తాజాగా మనీశ్ సోషల్మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘నాతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఓ స్నేహితురాలిని కోల్పోవడం ఇదే మొదటిసారి. ఆమె చనిపోయి నెల రోజులకుపైగా కావొస్తున్నా ఇప్పటికీ అబద్ధంగానే ఉంది. శ్రీదేవి నాకు 28 ఏళ్లుగా తెలుసు. ఇద్దరం కలిసి పెళ్లిలో సందడి చేశాం. శ్రీదేవి చనిపోయే కొన్ని గంటల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడాను. జాన్వి తొలి సినిమా గురించే చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ నాకు శ్రీదేవి ఫోన్ చేసి ఈవెంట్కి ఏ దుస్తులు వేసుకోవాలి? అని అడుగుతారేమోనని ఎదురుచూస్తున్నాను’
‘శ్రీదేవి ఎవరి గురించీ తప్పుగా మాట్లాడేవారు కాదు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె మరొకరి గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఎప్పుడూ దుస్తులు, ఆహారం, సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా నిబద్ధతతో నటించేవారు. శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషిలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి కోసం గాగ్రా ఛోళీలు డిజైన్ చేసేవాడిని. ఇప్పుడు జాన్వి తొలి సినిమా కోసం దుస్తులు డిజైన్ చేస్తున్నా. అమ్మలాగే జాన్విలో ఎంతో ప్రతిభ ఉంది.’ అని బాధ పడుతూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మనీశ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగానే అతిలోక సుందరి శ్రీదేవి చనిపోవడం ఇప్పటికీ అందరికీ పెద్ద షాకింగ్ గానే ఉంది.
Also Read