గుండు హనుమంతరావు కన్నుమూత
on Feb 19, 2018
దశాబ్దాలుగా తన యాసతో.. కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ కమెడియన్ గుండు హనుమంతరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం తెల్లవారుజామున క్షీణించడంతో.. కుటుంబసభ్యులు ఆయనను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే హనుమంతరావు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు సత్యాగ్రహం సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు.
తన కామెడీ టైమింగ్తో.. విలక్షణ నటనతో సుమారు 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇక అప్పట్లో బుల్లితెరపై వచ్చిన అమృతం ఒక సంచలనం. ఆ సీరియల్లో అంజి పాత్రకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అమృతం సీరియల్లో నటనకు గానూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును సైతం అందుకున్నారు. వయసు మీద పడటం.. అవకాశాలు రాకపోవడంతో.. చివరిదశలో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హనుమంతరావు దయనీయ స్థితికి చలించిన మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షలు ఇవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. హనుమంతరావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.