మనసుకు నచ్చింది రివ్యూ... ఇదొక హారర్ సినిమా!
on Feb 16, 2018
తారాగణం: సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, నాజర్..
దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
నిర్మాత: జెమినీ కిరణ్
ముందు మనమీద మనకు క్లారిటీ ఉండాలి. మనకు ఏం వచ్చు... ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది పూర్తి తెలిసుండాలి. తెలీని విషయాల్లో వేలు పెడితే... ఆ విషయమూ పాడవుతుందీ... వ్యవహారం రసాభాస అవుతుంది. నీకు ప్రకృతి అంటే ఇష్టం.. ఫొటోలు తీస్కో. నీకు మెడిటేషన్, యోగాసనాలపై అవగాహన ఉంది. క్లాసులు పెట్టుకో. లేదా... శిల్పశెట్ఠి చేసినట్టుగా... అందమైన ప్రకృతి నడుమ ‘యోగా క్లాసులు’ వీడియో తీసి మార్కెట్ చేస్కో. కచ్చితంగా సక్సెస్ అవుతావ్. అంతేతప్ప... క్లారిటీ లేని విషయాల్లో తలకాయ దూర్చి... ఎందుకు అందర్నీ బలిపశువుల్ని చేయడం? డబ్బున్న మారాజులు కాబట్టి... డబ్బుల్ని మీరు ప్రకృతి పాలు చేయగలరు. కానీ... రెండొందలంటే... సగటు వ్యక్తికి ఎక్కువ. నీ ప్రకృతి విలయతాండవానికి సగటు ప్రేక్షకుడ్ని బలి చేయడం ధర్మమా?
ఇంతకీ ఈ ఆవేదనకు కారణం ఏంటో చెప్పనేలేదు కదూ... ‘మనసుకు నచ్చింది’ అని ఓ సినిమా వచ్చింది. ఆర్థికంగా మానసికంగా.. ఆ సినిమా చేసిన గాయానికి వ్యధ చెంది.. ఆ బాధను ఇలా అక్షరరూపంలో వెలిబుచ్చానంతే. కృష్ణ గారి కుమార్తె మంజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సందీప్ కిషన్ హీరో. ఇక కథలోకెళ్దాం.
కథ:
హీరోహీరోయిన్లు.... చిన్నప్పట్నుంచీ ఒకేఇంట్లో కలిసి పెరిగిన బావామరదళ్లు. అయితే.. ఆ బంధాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడంతో... వీళ్లు ఫ్రెండ్సా? బావామరదళ్లా? అనే సందేహం జనాలను ఆద్యంతం పట్టి పీడిస్తూనే ఉంటుంది. వీరి రిలేషన్ పై ఇంట్లో పెద్దవాళ్లకు కూడా క్లారిటీ లేకపోవడంతో.. ఇద్దరికీ పెళ్లి చేయానుకుంటారు. రేపే పెళ్లి. ‘ఆట్... ఫ్రెండ్సయిన మాకు... పెళ్లి చేస్తారా?’ అంటూ ఇద్దరూ జంప్ అయిపోతారు. కథ గోవాకు చేరుతుంది. అక్కడ్నుంచి ప్రకృతి విలయతాండవం మొదలవుతుంది. అదేంటో తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
కథ పరంగా చెప్పుకుంటే నువ్వేకావాలే. అయితే... ఈ కథను గొప్పగా తీస్తే అది ‘నువ్వే కావాలి’... చెత్తగా తీస్తే.. ‘మనసుకు నచ్చింది’. టైటిల్ చూసి జనాల మనసుకు నచ్చే సినిమా తీశారనుకుంటే.. పప్పులో కాలేసినట్టే. వాళ్ల మనసుకు నచ్చినట్టు తీసుకున్నారు. దాన్ని జనాల మీదకొదిలారు. అందుకే దీనికి ‘మనసుకు నచ్చింది’ అనే పేరు పెట్టారు. సినిమాకు ఓ గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామరేంటో తెలుసుకోకుండా. ఏకంగా వెళ్లి మెగా ఫోన్ పట్టేసుకుంటే... సినిమాలు ఇలాగే తయారవుతాయ్. రెండు గంటలు సాగే ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా జనాలకు కనెక్ట్ అవ్వలేదంటే... సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా జనాలకు కనెక్ట్ అవ్వకపోవడంతో... సాంకేతికంగా కూడా ఏ అంశమూ... ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఓ వైపు తెరపై ఎమోషనల్ సీన్ నడుస్తుంటే... జనాలు విరగబడి నవ్వుతున్నారు. నవ్వులపాలు అవ్వడమంటే ఇదేనేమో!
దర్శకురాలు ప్రకృతి ప్రేమికురాలు అవ్వడంతో.. ఆ ప్రేమ కెమెరాలో కనిపించింది. సంభాషణా రచయితగా సాయిమాధవ్ పేరు పడింది కానీ... ఆయన రాసినట్టు అయితే లేవ్. కచ్చితంగా మంజులగారే రాసుకున్నారేమో!.టోటల్ గా చెప్పుకుంటే... ‘దీన్ని మనసుకు నచ్చింది అనడంకంటే... మైండ్ పోయింది అనడం కరెక్ట్.
ఈ సినిమాకు రేటింగ్ ని ఎక్స్ పెక్ట్ చేయకండి. ఎందుకంటే... దీనికి రేటింగ్ ఇచ్చేంత స్థాయి మాకు లేదు. నమస్కారం.