‘హలో’ వేడుకలో నాగ్ దెబ్బకు ఖంగు తిన్న అతిథులు!
on Dec 11, 2017
నాగార్జున తెలివైన హీరో. కర్రా ఇరక్కుండా పామూ చావకుండా తెలివిగా వ్యవహరించడంలో దిట్ట. అందుకే... కేవలం హీరోగానే కాక, వ్యాపావవేత్తగా కూడా మంచి స్థాయిలో ఉన్నాడు. ఆదివారం వైజాగ్ లో జరిగన ‘హలో’ ఆడియో వేడుకలో నాగ్ ప్రసంగం తెలివిగా సాగింది.
అదెలాగంటే... ఆ వేడుకకు అతిథులుగా విచ్చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు మాట్లాడుతూ... వైజాగ్.. సినిమా రంగానికి అనువైన ప్రదేశం అని... కావల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ... మద్రాస్ సాగరతీరం నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరానికి సినీ పరిశ్రమను తీసుకొచ్చిన ఘనత అక్కినేనిదే ననీ..ఆయన వారసులుగా ఆ దారిలోనే నాగ్ కూడా ప్రయాణించాలనీ.. హుస్సేన్ సాగర తీరంలో ఉన్న సినీ పరిశ్రమను వైజాగ్ సాగర తీరానికి తీసుకొచ్చే బాధ్యతను నాగ్ తీసుకోవాలని పేర్కొన్నారు.
అయితే... దానికి నాగ్ ఇచ్చిన సమాధానం విభిన్నంగా... తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందాన సాగింది. ‘మేం వైజాగ్ రాలేదని ఎవరన్నారండీ.. మేం ఎప్పుడో వచ్చేశాం. నా తొలి సినిమా ‘విక్రమ్’ తీసింది వైజాగ్ లోనే. ‘మాస్’ సినిమాను కూడా దాదాపుగా వైజాగ్ లోనే తీశాం. వైజాగ్ తో మా అనుబంధం ఈ నాటిది కాదు. మీ ఆహ్వానం మా కెంతో ఆనందాన్నిచ్చింది. తప్పకుండా ఇక్కడకొచ్చి సినిమాలు చేసి ‘వెళ్తాం’ ‘. అని ముగించాడు. ఆ ‘చేసి వెళ్తాం’ అనే పదంలోనే నాగ్ తెలివి తేటలు తేటతెల్లం అవుతున్నాయని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
అయినా... హైదరాబాద్ తో నాగ్ అనుబంధం ఎంత బలమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అన్నపూర్ణ స్టూడియో, ఏడెకరాలు, ఎన్ కన్విక్షన్ సెంటర్.. ఇంకా పలు వ్యాపార సంస్థలు ఇవన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయ్. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తో కూడా నాగ్ చాలా స్నేహంగా మసలుతాడు. మరి అలాంటి నాగ్... గంటా, యార్లగడ్డల ప్రతిపాదనలకు తలూపుతాడా? అది జరిగేదేనా? అసలు నాగ్ ని వైజాగ్ రమ్మని అడగడంలో అతిథుల అమాకత్వం తేటతెల్లం అవుతోంది. ఏమంటారు.