ఆ హీరో పోస్టర్ పై చండాలపు పని చేశాడు
on Aug 10, 2017
ఓ హీరో సినిమా పోస్టర్ పై మూత్రం పోస్తూ నిలబడ్డ ఓ వ్యక్తి ఫొటో ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే టాపిక్. ఇంతకీ ఆ హీరో ఎవరు? అది ఏ సినిమా పోస్టర్? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే వివరాల్లోకెళ్దాం.
ఆ హీరో ఎవరో కాదు. అక్షయ్ కుమార్. ఈ శుక్రవారం విడుదల కానున్న ఆయన చిత్రం... ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’పోస్టర్ పై ఓ అపరిచితుడు మూత్రం పోస్తుండగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరుబయట మలమూత్ర విసర్జన తప్పు అని చెప్పడమే ఈ సినిమా కథ సారాంశం. నరేంద్రమోదీ ‘స్వచ్ఛభారత్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ తీసిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా పోస్టర్ పై ఆ వ్యక్తి ఇలాంటి ఛండాలపు పని చేస్తుండటంతో నెటిజన్స్ ఈ వ్యవహారంపై విపరీతంగా జోకులు పేలుస్తున్నారు. సినిమాలు చూసి మనుషులు మారతారు అని అనుకోవడం నిజంగా పొరపాటే అని కామెంట్లు కూడా చేస్తున్నారు.
అయితే.. ఈ విషయంపై అక్షయ్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ‘మనిషి బాధ్యతాయుతంగా ఎలా బతకాలో మేం ఈ సినిమాలో చెప్పాం. బాధ్యత లేని మనిషి ఎలా ఉంటాడో... వెధవ పని చేసి మరీ ఆ వ్యక్తి చూపించాడు. రెండిటికీ వేదిక మా సినిమానే అవ్వడం ఆనందంగా ఉంది’అని చెప్పాడు అక్షయ్.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... పెళ్లి చేసుకొని భార్యను ఇంటికి తీసుకొస్తాడు అక్షయ్. కానీ... ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో భార్య ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇక తన భార్యను మళ్లీ ఇంటికి తెచ్చుకోవడానికి భర్తగా అక్షయ్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. వినోదం, సందేశం రెండింటినీ మిళితం చేసి దర్శకుడు శ్రీ నారాయణసింగ్ ఈ చిత్రాన్ని మలిచాడు. అక్షయ్ కుమార్ కి జోడీగా భూమి పద్నేకర్ నటించింది.
‘జయ జానకి నాయక’, ‘లై’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో పాటు.. రేపు సైలైంట్ కిల్లర్ గా అక్షయ్ బాలీవుడ్ మేజిక్ ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’చిత్రం కూడా విడుదల కానుంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి..