ఇలా అయితే హాల్లో కాదు.. టీవీలో చూస్తారు సినిమా..!
on Jun 27, 2017
కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తుండటంతో ఆ ప్రభావం వినోద రంగంపై ముఖ్యంగా సినిమాపై ఎక్కువగా పడనుంది. ప్రస్తుతం ఉన్న వినోదపన్నును సేవాపన్నుతో కలుపుతూ సినిమా టిక్కెట్లపైన 28% పన్ను విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గత శుక్రవారం నుంచే టిక్కెట్ల ధరలను పెంచి వసూలు చేస్తుండటంతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది. ఏసీ థియేటర్లలో గరిష్టంగా ఉన్న రూ.70 టికెట్టు ధర ఒక్కసారిగా రూ.120కి చేరింది. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.50 పెరిగింది. అప్పుడెప్పుడో లోకనాయకుడు కమల్ హాసన్ తను నటించిన సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా టీవీల్లోకే రిలీజ్ చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా అయితే థియేటర్లను నమ్ముకుని ఉన్నవారి పరిస్థితి ఏంటి అని గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ రోజులు అతి తొందర్లోనే వచ్చేలా కనిపిస్తున్నాయి.