ఏమైపోయాయ్.. టిక్కెట్లన్నీ? ఎవరెత్తుకు పోయారు?
on Apr 27, 2017
బాహుబలి టిక్కెట్లు మాయం... ఆన్ లైన్... ఆఫ్ లైన్... ఎక్కడ చూసినా నో టిక్కెట్స్.. వారం రోజులవరకూ థియేటర్లన్నీ హౌస్ ఫుల్... ఏపీ, తెలంగాణలోని 90 శాతం థియేటర్లలో సినిమా విడుదలవుతున్నా.. సామాన్యుడికి మాత్రం ఆ సినిమా దర్శన భాగ్యం ఇప్పట్లో కలిగేలా లేదు.. అటు ఆన్లైన్లో... ఇటు ఆఫ్లైన్లోనూ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో.... నిరాశే ఎదురవుతోంది. అసలు ఆఫ్లైన్ విక్రయాలు జరగకుండానే వారంరోజుల వరకు థియేటర్లన్నీ ఎలా హౌస్ఫుల్ అయ్యాయంటూ సాధారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
బాహుబలి-2 సినిమాపై కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం పెద్దఎత్తున బల్క్ బుకింగ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రేక్షకులకు అమ్మాల్సిన టికెట్లను అడ్డదారిలో రెట్టింపు ధరకు అమ్మేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఓ మాదిరి థియేటర్ నుంచి మల్టీప్లెక్సులన్నింటిలోనూ వారంరోజులవరకు టికెట్లన్నింటినీ బల్క్ బుకింగ్ అయిపోయాయని అంటున్నారు.
ఒకవైపు కార్పొరేట్ బల్క్ బుకింగ్లతో టికెట్లు దొరక్క సామాన్య ప్రేక్షకుడు నిరాశకు గురవుతుంటే, మరోవైపు ఆన్లైన్లో టికెట్లను బ్రోకర్లు కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఐదు శాతం టికెట్లను మాత్రమే అమ్మకానికి పెట్టి, మిగతా టికెట్లను బ్రోకర్ల ద్వారా బ్లాకులో అమ్ముకుంటున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అటు ఆన్లైన్లోనూ టికెట్లు అందుబాటులో లేక... ఇటు థియేటర్ల దగ్గరా టికెట్లు దొరక్కపోతే సాధారణ ప్రేక్షకులు సినిమా ఎలా చూసేది అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల దందాపై పోలీసులు ఓ కన్నేయాలని కోరుతున్నారు.