మార్చి 19.. కాజల్ డబుల్ ధమాకా
on Feb 22, 2021
ఈ ఏడాది మార్చి 19.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజు కాజల్ నటించిన రెండు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మంచు విష్ణుతో కలసి కాజల్ నటించిన `మోసగాళ్ళు` చిత్రం మార్చి 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున కాజల్ యాక్ట్ చేసిన మరో సినిమా కూడా రాబోతోంది. అదే.. `ముంబయి సాగా`. జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మి వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు నటించిన ఈ హిందీ చిత్రం కూడా మార్చి 19నే థియేటర్స్ లోకి రానుంది. మరి.. వేర్వేరు భాషల్లో ఒకే రోజున రాబోతున్న ఈ చిత్రాలతో కాజల్ కి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
కాగా, కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `ఆచార్య`లో నటిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మే 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. `ఖైదీ నంబర్ 150` వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరు, కాజల్ కాంబోలో వస్తున్న చిత్రమిదే కావడంతో.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.