క్రిష్ నిర్మాణంలో 'క్షణం' దర్శకుడి చిత్రమ్?
on Jul 7, 2020
సున్నితమైన కథాంశాలతో సందేశాత్మక సినిమాలు తీసే దర్శకుడు క్రిష్. 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్', 'కంచె'... అతడు తీసిన ప్రతి సినిమాలోనూ ఓ సందేశం, విలక్షణ నేపథ్యం ఉంటుంది. క్రిష్లో చక్కటి దర్శకుడితో పాటు, మంచి నిర్మాత ఉన్నాడు. 'దాగుడుమూత దండాకోర్', 'అంతరిక్షం' సినిమాలు, కొన్ని టీవీ సీరియళ్లు నిర్మించాడు. కథ నచ్చితే యువ దర్శకులతో సినిమాలు తీయడానికి ముందుకొచ్చే క్రిష్, తాజాగా రవికాంత్ పేరేపు చెప్పిన ఓ కథకు ఓకే చెప్పారట.
'క్షణం'తో దర్శకుడిగా పరిచయమైన రవికాంత్ పేరేపు, రెండో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. మూడో సినిమాను త్వరగా పట్టాలు ఎక్కించేలా ఉన్నాడు. ఇటీవల నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీలలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో దర్శకుడిగా వేరియేషన్ చూపించాడు. అతడు చెప్పిన స్టోరీ లైన్ క్రిష్ కి నచ్చిందనీ, తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాడని టాక్. మోటివేషనల్ జానర్లో ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుందట.