ఎన్సీబీ ఇంటరాగేషన్.. మూడుసార్లు భోరుమన్న దీపిక!
on Sep 27, 2020
బాలీవుడ్ డ్రగ్ కేసుకు సంబంధించిన ఎన్సీబీ చేసిన ఇంటరాగేషన్లో టాప్ యాక్ట్రెస్ దీపికా పడుకోనే మూడుసార్లు భోరుమని ఏడ్చిందని ఇండియా టుడే కథనం తెలిపింది. బాలీవుడ్ ఇండస్ట్రీతో లింకులున్న ఒక పెద్ద డ్రగ్ పెడ్లర్పై దర్యాప్తును మరింత ముమ్మరం చేయాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భావిస్తోంది. ఇంటరాగేషన్లో తారలు ఇస్తున్న స్టేట్మెంట్స్ను కోర్టుకు అందజేయనున్నట్లు ఎన్సీబీ డిప్యుటీ డైరెక్టర్ జనరల్ ఎం.ఎ. జైన్ తెలిపారు.
సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆ ఏజెన్సీ అందులో డ్రగ్ కోణానికి సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసింది. ఎన్సీబీ మాత్రమే కాక సుశాంత్ మృతి కేసును సీబీఐ, ఈడీ కూడా దర్యాప్తు జరుపుతున్నాయి. ఇదివరకే సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. డ్రగ్ కేసులో దీపికా పడుకోనేతో పాటు శ్రద్ధా కపూర్, రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్లను ఎన్సీబీ విచారించింది.
ఎన్సీబీ ఇంటరాగేషన్లో డ్రగ్ చాట్ చేసినట్లు ఒప్పుకున్న దీపిక, తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని వాదించినట్లు సమాచారం. ఆఖరుకి సారా అలీఖాన్ కూడా తాను డ్రగ్ వాడినట్లు వచ్చిన ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చి, తానెప్పుడూ ఎలాంటి డ్రగ్స్నూ వాడలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు అధికారులు గుచ్చిగుచ్చి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీపిక భోరున ఏడ్చిందని ఇండియా టుడే తన కథనాల్లో తెలియజేసింది.
Also Read