రెండోస్సారి: నాని, సాయిపల్లవి జోడీ!
on May 27, 2020
నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ 'శ్యామ్ సింగ రాయ్' మూవీని రూపొందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. పీరియడ్ బ్యాక్డ్రాప్తో, ఫిక్షన్-ఫాంటసీ మేళవింపుతో ఈ సినిమా కథను రాహుల్ రాశాడు. తాజాగా వినిపిస్తోన్న ఆసక్తికర సమాచారం ప్రకారం పాత కోల్కతా సిటీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అంటే ఇప్పటి కోల్కతా కాకుండా పాత కలకత్తా కనిపిస్తుందన్న మాట. దీని కోసం హైదరాబాద్లో కలకత్తా సెట్ను నిర్మించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చాలా భాగం సన్నివేశాలను ఈ సెట్లో తీయనున్నారు.
ముగ్గురు హీరోయిన్లు ఉండే ఈ మూవీలో ఇప్పటికే ఓ నాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ఎంసీఏ) మూవీ తర్వాత నాని, పల్లవి మరోసారి ఈ సినిమా కోసం జట్టు కడుతున్నారన్న మాట. నటనకు బాగా అవకాశమున్న క్యారెక్టర్ కావడంతో స్క్రిప్ట్ వినగానే పల్లవి ఓకే చెప్పేసిందని వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'విరాటపర్వం', 'లవ్ స్టోరి' సినిమాలు చేస్తోంది. మరోవైపు నాని 'వి', 'టక్ జగదీష్' సినిమాలు చేస్తున్నాడు.