సంక్రాంతి కోసం.. బాలయ్య రాజీ పడిపోతున్నాడా?
on Oct 31, 2016
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. రెండు పాటలు, కొన్ని కీలకమైన సన్నివేశాలు మినహా.. చిత్రీకరణ పూర్తయ్యింది. కాబట్టి సంక్రాంతికి విడుదల అవ్వడానికి ఢోకా లేనట్టే. అయితే.. గ్రాఫిక్స్ విషయంలో అటు బాలయ్య, ఇటు క్రిష్ రాజీ పడిపోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో గ్రాఫిక్స్ చేయించాలంటే డబ్బులతో పని. వాళ్లకు కోట్లు గుమ్మరించాల్సిందే. పైగా టైమ్ కూడా ఎక్కువ తీసుకొంటాయి. గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో బాలయ్య, క్రిష్ రాజీ పడ్డారట.
హైదరాబాద్ లోనే ఈ సినిమాకి గ్రాఫిక్స్ పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో బయటపడడమే కాకుండా, అనుకొన్న సమయానికి సినిమా విడుదల చేయొచ్చన్నది బాలయ్య ప్లాన్. ఇప్పటికే గౌతమి పుత్ర బిజినెస్ పూర్తయిపోయింది కాబట్టి... బయ్యర్లతో ఎలాంటి గొడవా ఉండదు. అయితే బాహుబలి తరవాత విజువల్ ఎఫెక్ట్స్ రేంజు పెరిగిపోయింది. ఆషామాషీ గ్రాఫిక్స్ మనకంటికి ఆనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడడం ఇబ్బందికరమైన పరిణామమే. అయితే చిత్రబృందం మాత్రం కంటెంట్లో బలం ఉంటే గ్రాఫిక్స్ అవసరం లేదన్నట్టు మాట్లాడుతోంది. మరి ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఏమంటారో చూడాలి.