పీత రుచి అదిరిపోయింది! చిరు వండిపెట్టినదేమిటో రివీల్ చేసిన నాగ్!
on Apr 3, 2021
రెండు రోజుల క్రితం అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఫొటో వైరల్ అయింది. అది మెగాస్టార్ చిరంజీవితో కలిసి నాగ్ తీసుకున్న ఫొటో. ఆ ఫొటో తీసింది చిరు భార్య సురేఖ. చిరు స్వయంగా వంటచేసి డిన్నర్ పెట్టారనీ, అది చాలా రుచికరంగా ఉందనీ నాగ్ రాసుకొచ్చారు. అయితే ఆయన ఏం చేసి పెట్టారో అప్పుడు వెల్లడించలేదు నాగ్. లేటెస్ట్గా ఆ వంట ఏమిటో బహిర్గతం చేశారు నాగ్. చిరు తనకు రాజమండ్రి నుంచి వచ్చిన లాబ్స్టర్ (పెద్ద పీత) వండి పెట్టారని చెప్పారు.
నాగార్జున టైటిల్ రోల్ చేసిన 'వైల్డ్ డాగ్' మూవీ మార్చి 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్లో "చిరంజీవి, మీరు కలిసి మొన్న వంట చేశారు కదా, అట్లాగే మీ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారా?" అని నాగ్ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా ఆరోజు అనుభవాన్ని నాగార్జున పంచుకున్నారు. "ఆ రోజున ఇంట్లో వాళ్లందరూ ప్రివ్యూ షోలు చూసేందుకు వెళ్లిపోయారు. ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. ఆ రోజు వేరే పనిమీద చిరంజీవి గారు ఫోన్ చేసి, "సాయంత్రం ఏం చేస్తున్నావ్ నాగ్?" అనడిగారు. "ఇంట్లో ఎవరూ లేరు.. ఒక్కడినే ఉన్నాను" అని చెప్పాను. "అయితే రా.. ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ (పెద్ద పీత) వచ్చింది. వండి పెడతాను నీకు" అని చెప్పారు. సరేనని సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లాను. పాత సినిమాల గురించీ, మా సినిమాలు రిలీజయ్యేటప్పుడు ఉండే టెన్షన్ల గురించీ మాట్లాడుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ గడిపాం. చక్కగా లాబ్స్టర్ వండి పెట్టారు. టేస్ట్ అదిరిపోయింది. ఆయన ఫెంటాస్టిగ్గా చేశారు." అని చెప్పుకొచ్చారు. అయితే.. చిరుతో మల్టీస్టారర్ గురించి మాత్రం చెప్పకుండా దాటేశారు నాగ్.
Also Read