వాళ్ల రొమాన్స్కి బిజినెస్ వర్గాల్లో క్రేజ్!
on Aug 10, 2019
తెలుగులో మరో ఆసక్తికర చిత్రం రూపొందుతోంది. నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న సినిమాపై అందరి కళ్లూ నిలుస్తున్నాయి. 'ఫిదా' వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత శేఖర్, కెరీర్ బెస్ట్ ఫిల్మ్ 'మజిలీ' తర్వాత చైతూ కలిసి తొలిసారి పనిచేస్తుండటంతో సహజంగానే బిజినెస్ వర్గాలు ఈ మూవీపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చైతూ జోడీగా సాయిపల్లవి నటిస్తుండటం మరింత ఆకర్షణను తీసుకొస్తోంది. 'ఫిదా'తోటే సాయిపల్లవి తెలుగుతెరకు పరిచయమై, సంచలన తారగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ శేఖర్ డైరెక్షన్లో పనిచెయ్యడం కోసం చైతూ ఎదురుచూస్తూ వస్తున్నాడు. ఇప్పటికి అది కుదిరింది. అందమైన లవ్ స్టోరీతో రూపొందే ఈ సినిమా జూన్లోనే లాంఛనంగా మొదలైనా, సెట్స్ మీదకు మాత్రం వచ్చే నెల (సెప్టెంబర్)లో వెళ్తోంది. మూడు నెలల్లో సినిమాని కంప్లీట్ చేసి, డిసెంబర్లో రిలీజ్ చెయ్యాలనేది నిర్మాత సునీల్ నారంగ్ ప్లాన్. అందుకు తగ్గట్లు ప్రి ప్రొడక్షన్ పనుల్ని పక్కాగా చేసుకుపోతున్నారు. లవ్ స్టోరీలు చైతూకు బాగా కలిసిరావడం, పల్లవితో తొలిసారి జోడీ కట్టడం.. ఈ సినిమా విజయంపై ధీమా కలిగిస్తున్నాయి. అంతే కాదు.. ఇది హీరోగా చైతూకు 20వ సినిమా.