అల్లరి నరేశ్లో ఇలాంటి నటుడున్నాడా?!
on Jun 30, 2020
"ఒక మనిషి పుట్టడానిక్కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సార్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది?".. ఇది 'నాంది' సినిమాలో అల్లరి నరేష్ వేస్తున్న ప్రశ్న. ఆ సినిమా ఇతివృత్తం ఏ లైన్ మీద ఆధారపడిందో ఈ ఒక్క డైలాగ్ చెబుతోంది. జూన్ 30 హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నాంది చిత్ర బృందం ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) పేరుతో టీజర్ను రిలీజ్ చేసింది.
ఆ టీజర్ ప్రకారం అల్లరి నరేష్ ఒక అండర్ ట్రయల్ ఖైదీ అనీ, చేయని నేరానికి జైలు పాలై, న్యాయం కోసం అలమటించిపోతున్నాడనీ అర్థమవుతోంది. 2015 నాటికి దేశంలోని జైళ్లన్నింటిలో 3,66,781 మంది ఖైదీలుంటే, వారిలో 2,50,000 మంది అండర్ ట్రయల్ ఖైదీలేననీ, అంటే కోర్టులో శిక్షపడని ఖైదీలేననీ ఈ టీజర్లో చెప్పారు. అలాంటి ఒక అండర్ ట్రయల్ ఖైదీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించాడు విజయ్ కనకమేడల. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది.
'నాంది' అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటివరకూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగభరితమైన పాత్రను చేస్తున్నారని అర్థమవుతోంది. టీజర్లో చూపించిన దాని ప్రకారం పోలీస్ స్టేషన్లో ఒక షాట్లో ఆయన పూర్తి నగ్నంగా కనిపించారు. దీన్ని బట్టి ఈ పాత్రను ఆయన ఎంత ప్రేమించి ఉంటారో ఊహించవచ్చు. నటుడిగా అల్లరి నరేష్లోని మరో కోణాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం.
వరలక్ష్మీ శరత్కుమార్ లాయర్గా, హరీష్ ఉత్తమన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా నటిస్తున్నట్లు టీజర్ తెలియజేస్తోంది.