ఎన్టీఆర్ జయంతి... నందమూరి సోదరుల కీలక నిర్ణయం
on May 27, 2020
తెలుగుజాతి కీర్తిని ప్రపంచం నలుమూలల దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. మే 28న... అనగా బుధవారం ఆయన జయంతి. ఈ సందర్భంగా నందమూరి బ్రదర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే....
ప్రతి ఏడాది నందమూరి వంశ మూల పురుషుడు, తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్ జయంతి రోజున ఉదయమే హైదరాబాద్ హుసేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ చేరుకుని తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పిస్తారు. కొన్ని సంవత్సరాలుగా వాళ్లు ఇద్దరు తాతయ్య సమాధి చేరుకుని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు అనే సమాచారం తెలిస్తే అధిక సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది కనుక... వాళ్ల ఆరోగ్యాలను ప్రమాదంలోకి పెట్టడం ఇష్టం లేక, కష్టమైనా ఈ నిర్ణయం తీసుకున్నారని నందమూరి బ్రదర్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.