డ్రగ్ కేసులో బాలీవుడ్ స్టార్లపై దర్యాప్తు చేయనున్న ఎన్సీబీ!
on Sep 18, 2020
2019లో జరిగిన డ్రగ్ పార్టీలో పాల్గొన్న దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ దీపికా పడుకోనే, హీరో విక్కీ కౌశల్, మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతూ తన దగ్గరకు వచ్చిన ఫిర్యాదును ఢిల్లీలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హెడ్క్వార్టర్స్ ముంబై ఎన్సీబీకి బదలాయించింది. ఢిల్లీలోని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్థానాను కలిసిన శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నాయకుడు మంజీందర్ సిర్సా ఈ ఫిర్యాదును అందజేశారు. దానిని ఎన్సీబీ రిజిస్టర్ చేసింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా మంజీందర్ తెలియజేశారు. ముంబైలోని కరణ్ జోహార్ నివాసంలో ఆ డ్రగ్ పార్టీ జరిగిందనీ, దానికి సంబంధించిన వీడియో కూడా ఉందనీ, ఆ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనీ ఆయన తెలిపారు. అందు నిమిత్తమే తాను ఎన్సీబీ చీఫ్ రాకేశ్ ఆస్థానాను కలిసి ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు.
ఆ డ్రగ్ పార్టీలో కరణ్ జోహార్, విక్కీ కౌశల్, దీపికా పడుకోనే, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ తదితర బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారని, వారు డ్రగ్స్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు. వారిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985లోని చాప్టర్ 4 కింద కేసు పెట్టినట్లు సిర్సా తెలిపారు.
Also Read