కరోనా అనంతర పరిస్థితులకు అద్దం పట్టే సినిమా!
on Apr 2, 2020
కరోనా మీద సినిమాలు తీయడానికి కొందరు ఉత్సాహం చూపిస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కరోనా మీద కథలు, సినిమాలు రెడీ అవుతున్నాయి. తెలుగులోనూ కరోనా నేపథ్యంలో ఒక సినిమా రెడీ అవుతోంది. అయితే... ఈ సినిమా కరోనా మీద తెరకెక్కడం లేదు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పరిణామాలకు అద్దం పట్టేలా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు వేణు జీడీ 'విష్వక్' అని ఒక సినిమా తీస్తున్నాడు. కె. అజయ్ కుమార్ నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారు.
"మెరుగైన జీవితం కోసం ఇండియా వదిలి వెళ్లిన ఎన్నారైలను ప్రభుత్వ ఖర్చులతో సురక్షితంగా తిరిగి ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇండియా అభివృద్ధికి సహాయపడిన రోజువారీ కూలీలు, తమ గ్రామాలు వెళ్లడానికి వందల మైళ్ళు నడిచే దారి ఎంచుకున్నారు. రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి కష్టాలు పడుతున్నారు" అని 'విష్వక్' పోస్టర్ మీద రాసి ఉంది. కరోనా మహమ్మారి ప్రభావం, లాక్ డౌన్ కారణంగా నగరాలు, పట్టణాల్లో పనులు లేక వేలాది కిలోమీటర్లు నడిచిన వలస కార్మికుల కష్టాలను క్లుప్తంగా వేణు జీడీ చెప్పినట్టు ఉంది.
తాము సినిమా స్టార్ట్ చేసినప్పుడు కరోనా పెద్ద సమస్య కాదనీ, కరోనా క్రైసిస్ మీద తీసిన సినిమా కానప్పటికీ.... కరోనా తర్వాత పరిస్థితులు, పరిణామాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుందనీ, లక్షలాది భారతీయులు సినిమాకు కనెక్ట్ అవుతారనీ వేణు జీడీ అన్నారు.
Also Read