నితిన్ హీరోయిన్కి తెలుగులో మరో ఛాన్స్!
on Sep 10, 2018
నితిన్ హీరోగా నటించిన 'చిన్నదాన నీకోసం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బెంగాలీ బ్యూటీ మిస్తీ చక్రవర్తి. తొలి సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. తరవాత నటించిన 'కొలంబస్' కూడా ప్లాపే. ఆపై నటించిన 'బాబు బాగా బిజీ' కూడా బోల్తా కొట్టింది. తెలుగులో నటించిన మూడు సినిమాల ఫలితాలు ప్రభావం అనుకుంట... ఏడాదిగా తెలుగులో మిస్తీ చక్రవర్తి మరో సినిమా చేయలేదు. కాని దర్శకుడిగా పరిచయం అవుతోన్న 'డైమండ్' రత్నబాబు ఆమె నటనపై నమ్మకం పెట్టుకున్నాడు. ఆది సాయికుమార్ హీరోగా 'డైమండ్' రత్నబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో ఆది సరసన మిస్తీ చక్రవర్తి నటించనుంది. అగ్రిమెంట్ మీద ఇంకా సంతకం చేయకున్నా... మిస్తీ సినిమాలో నటించడం ఖాయమని తెలిసింది. 'హార్ట్ ఎటాక్'తో అదా శర్మ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
రెండు మూడు సినిమాల్లో పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ, ప్రస్తుతం తెలుగులో ఆమెకు అవకాశాలు లేవు. 'లై' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన మేఘా ఆకాశ్దీ అదే పరిస్థితి. 'చల్ మోహన్రంగ' తరవాత ఆమెకు అవకాశాలు లేవు. ఈమాటకు వస్తే.. ఈమధ్య కాలంలో నితిన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ల పరిస్థితి అంతంత మాత్రమే. సరైన అవకాశాలు రావడం లేదు. అదా శర్మ, మేఘా ఆకాశ్ పేర్లు కనీసం ప్రేక్షకులకు గుర్తున్నాయి. మిస్తీ పేరు ఎవరికీ గుర్తులేదు. ఆది సినిమా ఆమెకు హిట్ ఇస్తుందేమో చూడాలి!!