ఫ్లాపులు.. పాఠాలు... మెహరీన్ వేదాంతమ్!
on Jan 7, 2019
'గెలుపులో ఏముందిరా? మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది? ఒక్కసారి ఓడిపోయి చూడు... ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది' అని 'పిల్ల జమీందార్' సినిమాలో ఓ డైలాగ్ వుంది. నానితో రావు రమేష్ చెబుతాడు. ఇప్పుడీ డైలాగ్ ఎందుకు? అంటే.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో కథానాయికగా పరిచయమైన మెహరీన్.. ఒక్కసారి కాదు, ఐదుసార్లు ఓటమిని చూసింది. తొలి సినిమా తరవాత ఆమెకు అవకాశాలు బాగా వచ్చాయి. రెండో సినిమా 'మహానుభావుడు', మూడో సినిమా 'రాజా ది గ్రేట్' కూడా విజయాలు సాధించాయి. తరవాత 'కేరాఫ్ సూర్య', 'జవాన్', 'పంతం', 'నోటా', 'కవచం'... మెహరీన్ నటించిన ప్రతి సినిమా ప్లాప్ అయ్యింది. హిట్స్ కంటే ఫ్లాపులు ఎక్కువ పాఠాలు నేర్పుతాయని ఆమె అంటున్నారు. 'ఎఫ్2' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెహరీన్ ఫ్లాపుల గురించి మాట్లాడారు. "జీవితంలో జయాపజయాలు భాగమే. విజయం కంటే అపజయమే మనకు ఎక్కువ పాఠాలు చెబుతుందని నేను నమ్ముతాను. ఏ పనిలోనైనా రెండే రిజల్ట్స్ వుంటాయి. ఒకటి విజయం. రెండు అపజయం. ఈ రెండిటి కంటే ముఖ్యమైనది ఏదంటే... ప్రతి అంశం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే" అని మెహరీన్ అన్నారు. 'రాజా ది గ్రేట్'తో ఆమెకు దర్శకుడు అనిల్ రావిపూడి ఒక విజయం అందించారు. 'ఎఫ్2'తో ఆమెను వరుస ప్లాపుల నుంచి బయట పడేస్తారేమో చూడాలి.