రాజమౌళి వస్తున్నాడు.. మెగాస్టార్ తప్పుకున్నాడు!
on Feb 19, 2020
రాజమౌళి దెబ్బకు టాలీవుడ్లోని టాప్ హీరోలు, మిగతా టాప్ డైరెక్టర్లు 'అబ్బా!' అంటున్నారు. అవును. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆయన రాజముళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ 2021 జనవరి 8న విడుదలవుతుందని ప్రకటించడంతో మిగతా భారీ, ప్రతిష్ఠాత్మక సినిమాలపై దాని ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. మొదట ప్రకటించినట్లు 'ఆర్ఆర్ఆర్' జూలై 30న రిలీజ్ కాకపోయినా, దసరాకైనా వచ్చేస్తుందని భావించిన ఇతర టాప్ హీరోలు తమ సినిమాల్ని 2021 సంక్రాంతికి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ అదే సంక్రాంతి సెలవులకు మారడంతో అవాక్కయ్యారనేది కాదనలేని నిజం. దీని ఎఫెక్ట్ ఆఖరుకి మెగాస్టార్ పైనా పడింది.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారం చేసుకొని కల్పిత కథతో, 20వ శతాబ్దం తొలినాళ్ల నేపథ్యంతో రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'ను మొదట జూలై 30న విడుదల చేయనున్నట్లు 10 నెలల క్రితమే నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తారక్, చరణ్.. ఇద్దరూ గాయాల పాలవడం, తారక్ సరసన నటించే హీరోయిన్ మారడం వంటి కారణాలతో షూటింగ్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం జూలైలో ఈ సినిమా విడుదలవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే 'ఆర్ఆర్ఆర్' జూలైలో కాకుండా, అక్టోబరులో దసరా సీజన్లో సినిమా రిలీజ్ అవుతుందని అనధికార వర్గాలు కొద్ది రోజుల క్రితం వెల్లడించాయి. దాంతో మెగాస్టార్-కొరటాల శివ ('ఆచార్య') సినిమా, పవన్ కల్యాణ్-క్రిష్ మూవీ, మహేశ్-వంశీ పైడిపల్లి మూవీ, ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమా, అల్లు అర్జున్-సుకుమార్ మూవీ నిర్మాతలు కాస్త అటూ ఇటుగా తమ సినిమాల్ని సంక్రాంతి సమయంలో తీసుకురావడానికి ప్లాన్ చేసుకున్నారు.
ఇదివరకు ఏప్రిల్ లోగా షూటింగ్ అంతా పూర్తవుతుందనీ, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు నాలుగైదు నెలల సమయం తీసుకొని, అక్టోబరులో సినిమాని విడుదల చెయ్యాలని 'ఆర్ఆర్ఆర్' దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఏప్రిల్ లోగా షూటింగ్ పూర్తయ్యే అవకాశం లేకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్కు మరింత ఎక్కువ సమయం పట్టేట్లు ఉందని తేలడంతో.. దసరా సీజన్ తర్వాత, మరో పెద్ద సీజన్ సంక్రాంతే కాబట్టి, అప్పుడే ఆ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చి, 2021 జనవరి 8న సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సంక్రాంతి టార్గెట్ చేసుకున్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్.. ముగ్గురూ ఇదివరకే సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. దానికి తగ్గట్లుగా తమ సినిమాల షూటింగ్ షెడ్యూళ్లను ప్లాన్ చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ సినిమా 'అల.. వైకుంఠపురములో'.. రెండూ ఆ ఇద్దరు హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్లుగా నిలవడం, రెండూ కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడంతో మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాని 2020 ఆగస్టులో కాకుండా 2021 సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ సంక్రాంతికి వెళ్లడంతో, ఆయన తన సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనను విరమించుకున్నట్లు మెగా కాంపౌండ్ వర్గాలు తెలిపాయి. 'ఆర్ఆర్ఆర్' బరిలో ఉంటే, మరో సినిమా వైపు ప్రేక్షకులు చూడరనీ, ఆ సినిమాపై పోటీగా తమ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఏ హీరో కోరుకోవడం లేదనీ ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అంతెందుకు.. 'ఆర్ఆర్ఆర్'పై ఏ సినిమా పోటీకి దిగినా అది బాక్సాఫీస్ దగ్గర 'క్రష్' అయిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు తేల్చిచెబుతున్నారు. అందువల్ల 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండూ ఒకేసారి వచ్చినా బ్లాక్బస్టర్ అయినట్లు, 'ఆర్ఆర్ఆర్'పై పోటీకి వస్తే తమ సినిమా కూడా బ్లాక్బస్టర్ అవుతుందని ఏ నిర్మాతా నమ్మడం లేదు.
'ఆచార్య' సినిమా నిర్మాతలైనా అంతే. ఆ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డితో కలిసి 'ఆర్ఆర్ఆర్' హీరో చరణ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పైగా 'ఆచార్య' సినిమాలో చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేయనున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' మూవీలో తన సన్నివేశాలు మొత్తం పూర్తయ్యాకే అతను మరో సినిమా చెయ్యడానికి వీలుంది. ఈ కారణంతో చిరంజీవి సినిమాలో చరణ్కు సంబంధించిన సన్నివేశాలు తియ్యడానికి జాప్యం జరుగుతోంది. అందువల్ల 2020 దసరాకే ఈ మూవీని తీసుకువచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరైతే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? 'తెలుగుఒన్'కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు 'ఆచార్య' మూవీని 2021 మార్చిలో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అంటే రాజమౌళి సినిమా విడుదల తేదీ మారడంతో అందుకు అనుగుణంగా తన సినిమా విడుదల తేదీని మెగాస్టార్ సైతం మార్చేసుకుంటున్నారన్న మాట.
ఇదే పరిస్థితి పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్, బన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. వారి సినిమాలేవీ సంక్రాంతికి వచ్చే సాహసం చెయ్యడం లేదు. ప్రభాస్, మహేశ్, బన్నీ సినిమాలు కూడా 2021 వేసవికే వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది మేలో 'వకీస్ సాబ్'గా రావడం ఇప్పటికే ఖాయం చేసుకున్న పవన్ కల్యాణ్, క్రిష్ డైరెక్షన్లో చేస్తోన్న సినిమానీ ఈ ఏడాదే తీసుకురావడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫాస్ట్గా సినిమా తీస్తాడని పేరుపడిన క్రిష్ ఏం చేస్తాడో చూడాలి. ఇలా ఒక్క సినిమా వల్ల ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక సినిమాల రిలీజ్ షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యింది. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ చివరి నిమిషంలో వాయిదా పడితే? ఆ ఆలోచన చెయ్యడానికి కూడా టాలీవుడ్ భయపడుతోంది.