'మీ టూ'లో ఇదో వింత పరిస్థితి!
on Jan 21, 2019
హిందీ సినిమా ఇండస్ట్రీలో 'మీ టూ' మంటలు ఇంకా చల్లారలేదు. పేరున్న నటులు, దర్శకులు పేర్లు బయటకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. 'మీ టూ'లో పేర్లు వచ్చిన దర్శకులతో పని చేసేది లేదని టాప్ హీరోలు తెగేసి చెప్పడంతో కొందరు దర్శకులు సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఓ విధంగా మెజార్టీ హిందీ ఇండస్ట్రీ మహిళల వైపు నిలబడింది. కన్నడలో అందుకు భిన్నమైన పరిస్థితి. 'మీ టూ'లో భాగంగా ఓ హీరోయిన్ మీడియా ముందుకు రావడంతో అప్పుడామె నటిస్తున్న ఓ సినిమా అర్ధాంతరంగా ఆగింది. అసలు వివరాల్లోకి వెళితే...
హిందీతో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలపై 'మీ టూ' ఏమంత ప్రభావం చూపలేదు. యాక్షన్ కింగ్ అర్జున్ పేరు తప్ప పెద్ద నటులు, దర్శకుల పేర్లు ఏవీ బయటకు రాలేదు. అర్జున్ తనను లైంగికంగా వేధించాడని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపించారు. వేధింపుల విషయం బయట పెట్టిన తరవాత తనకు అవకాశాలు తగ్గాయని ఆమె వ్యాఖ్యానించారు. అవకాశాలు తగ్గడం మాట పక్కన పెడితే... అప్పట్లో ఆమె నటిస్తున్న సినిమా ఒకటి ఆగింది. అదే తెలుగు హిట్ 'క్షణం' కన్నడ రీమేక్. ఎందుకు ఆగింది? అంటే... అందులో హీరో అర్జున్ బంధువు చిరంజీవి సర్జా. తమ కుటుంబ సభ్యుడిపై శృతి హరిహరన్ ఆరోపణలు చేయడంతో చిరంజీవికి కోపం వచ్చింది. సినిమా ఆగింది. అప్పటికే ఎక్కువ భాగం సినిమా చిత్రీకరణ పూర్తి పూర్తయింది. శృతి హరిహరన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణతో సహా! అందువల్ల, మరో హీరోయిన్ లేదా హీరోతో మళ్లీ సినిమా అంతా తీయలేని పరిస్థితి. దాంతో దర్శక నిర్మాతలు చిరంజీవిని బతిమాలితే సినిమా పూర్తి చేయడానికి అంగీకరించాడు. నిర్మాతలు నష్టపోకూడదని, వర్క్ కమిట్మెంట్ కోసమనీ సినిమా చేస్తున్నాను తప్ప మా కుటుంబ సభ్యుడిపై ఆరోపణలు చేసిన నటిపై కోపం తగ్గలేదనీ అన్నట్టు అర్థం వచ్చేలా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలాగోలా సినిమా పూర్తి అవుతున్నందుకు నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. శృతి హరిహరన్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమైంది.