రవితేజ నేల చూపులు మానేశాడు
on Nov 14, 2019
మాస్ మహారాజా రవితేజ 'క్రాక్' ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కలిగిన ఫస్ట్ ఫీలింగ్... రవితేజ నేల చూపులు మానేశాడు. సీరియస్ స్ట్రయిట్ లుక్లో అభిమానులకు కిక్ ఇచ్చాడు. 'రాజా ది గ్రేట్'లో రవితేజ అంధుడిగా నటించాడు. క్యారెక్టర్ కి తగ్గట్టు నటించాడు. అందులో అతడి నటనకు మంచి పేరొచ్చింది. అయితే, ఆ తర్వాత నటించిన సినిమాల్లో 'రాజా ది గ్రేట్' హ్యాంగోవర్లో నటిస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నేల చూపులు చూస్తున్నాడని చాలామంది కామెంట్ చేశారు. అందుకు తగ్గట్టు ఆయా సినిమాల ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి.
'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్లో రవితేజ ఎంత స్టయిలిష్ గా ఉన్నపటికీ, అతడి లుక్ మాత్రం కిందకు ఉంటుంది. 'నేల టికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', విడుదల కావలసిన 'డిస్కో రాజా'... ప్రతి సినిమా నుండి విడుదలైన ఏదో ఒక పోస్టర్లో రవితేజ డిఫరెంట్ డిఫరెంట్ కళ్లజోళ్లు పెట్టుకుని కనిపించాడు. అటువంటి ప్రయోగాలు చేయకుండా దర్శకుడు గోపీచంద్ మలినేని 'క్రాక్' ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. రవితేజ కళ్ళల్లో సీరియస్నెస్ మాత్రమే చూపించాడు. రవితేజ కూడా మీసం పెంచి, గడ్డం కొంచెం తగ్గించి తన లుక్లో కొత్తదనం చూపించాడు. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీ.
'డాన్ శీను', 'బలుపు' తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా 'క్రాక్'. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేస్తామని తెలిపారు. సో... 2020లో రవితేజ డబుల్ ధమాకా ఖాయం అన్నమాట. ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన 'డిస్కో రాజా' వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలల్లో 'క్రాక్' విడుదల అవుతుంది.