150 రోజులుగా కాలు బయటపెట్టని మమ్ముట్టి!
on Aug 7, 2020
దేశంలో లాక్డౌన్ సడలింపులు వచ్చేసినా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం స్వయంగా కొత్త లాక్డౌన్ నిబంధనలు విధించుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఇప్పటికి 150 రోజులై పోయిందంట. ఆ విషయాన్ని మమ్ముట్టి కుమారుడు, 'మహానటి'లో జెమినీ గణేశన్గా నటించిన దుల్కర్ సల్మాన్ వెల్లడించాడు.
మార్చిలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన రోజు నుంచీ ఇప్పటి దాకా తన తండ్రి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదని దుల్కర్ తెలిపాడు. సొంత లక్ష్యాలను నిర్దేశించుకోవడం మమ్ముట్టికి ఇష్టంలా అగుపిస్తోంది. బయటకు రాకుండా ఇంట్లోనే ఎంత కాలం ఉండగలనో చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో ఆయన తన ఫొటోగ్రఫీ హాబీని కొనసాగిస్తూ వస్తున్నారు. కారులో బయటకు తీసుకెళ్తానని తాను చెప్పినా తండ్రి నిరాకరించారని కూడా దుల్కర్ వెల్లడించాడు. మమ్ముట్టి నిబద్ధతకు సెల్యూట్ చెయ్యాల్సిందే.
ఈ ఏడాది లాక్డౌన్కు ముందు 'షైలాక్' సినిమాలో నటించిన ఆయన ప్రస్తుతం 'ద ప్రీస్ట్' అనే మూవీలో నటిస్తున్నారు.