పృథ్వీరాజ్ ఎవరితో, ఎలా ప్రేమలో పడ్డాడో తెలుసా?
on Oct 16, 2020
మలయాళ నటుడు పృథ్వీరాజ్ 2011 ఏప్రిల్ 25 న కేరళ పాలక్కాడ్లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో సుప్రియ మీనన్ను వివాహం చేసుకున్నాడు. 2014లో తమకు పుట్టిన కుమార్తెకు వారు అలంకృత అనే పేరు పెట్టుకున్నారు. సుప్రియ ఎవరు, ఆమెను పృథ్వీరాజ్ ఎలా వివాహం చేసుకున్నాడనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
సుప్రియ స్వతహాగా మలయాళీ అయినా, ఎక్కువ కాలం ముంబైలోనే గడిపారు. సుప్రియ పరిచయం కాకముందే పృథ్వీరాజ్కు ముంబై తెలుసు. కానీ అతనికి తెలియని ముంబైని ఆమె చూపించారు. గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ నవల 'శాంతారామ్' అంటే పృథ్వీకి బాగా ఇష్టం. ఆ పుస్తకం చదివాక అందులో పేర్కొన్న ముంబైలోని హాజీ అలీ, లియోపోల్డ్ కేఫ్ లాంటి ప్రదేశాలను చూడాలని అనుకున్నాడు పృథ్వీ. ఆ టైమ్లో సుప్రియ బీబీసీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నందున పృథ్వీ ఆమెకు స్నేహితురాలయ్యారు.
'శాంతారామ్'లో పేర్కొన్న ప్లేస్లకు తను తీసుకువెళ్లమని ఆమెను అడిగాడు పృథ్వీ. ఆ ప్లేస్లు చూసే నిమిత్తం కొన్ని వారాల పాటు ముంబైలో గడిపాడు పృథ్వీ. ఆ టైమ్లో అతడి జీవితాన్ని ఆక్రమించుకున్నారు సుప్రియ. తాము ప్రేమలో పడ్డామని తెలుసుకున్న వాళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ముంబైతో పృథ్వీకి రొమాంటిక్ కనెక్షన్ ఉందన్నమాట. పృథ్వీ కోసం తన జాబ్ వదులుకొని కేరళకు వచ్చేశారు సుప్రియ. ఆమె సపోర్ట్ లేకుండా ఇవాళ తానున్న స్థాయికి వచ్చేవాడిని కాదని వినమ్రంగా చెప్తాడు పృథ్వీ.
లండన్లోని ఓ పేరుపొందిన యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సుప్రియ. 2007లో ఆమె బీబీసీలో చేరారు. రూరల్ ఇండియా స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేశారు. పృథ్వీ, సుప్రియ ఇద్దరికీ ప్రయాణాలంటే మహా ఇష్టం. ప్రపంచంలోని అంతగా పేరు పొందని ప్రాంతాలను సందర్శిస్తుండటం వాళ్ల హాబీ. ఇప్పుడు కూడా తమ హాబీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. వారితో పాటు అలంకృత కూడా జాయిన్ అవుతోంది.