తెలుగులో రీమేక్ కానున్న 'కప్పేలా'
on Jul 5, 2020
టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్, కోలీవుడ్లోకి రీమేక్ అవుతుండటం పరిపాటి. అయితే ఇటీవల మలయాళం సినిమాలంటే టాలీవుడ్ చెవి కోసుకుంటోంది. మలయాళంలో హిట్టవుతున్న సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి ఇక్కడి నిర్మాతలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. 'లూసిఫర్', 'అయ్యప్పనుమ్ కోషియుమ్', 'డ్రైవింగ్ లైసెన్స్' వంటి సినిమాల రీమేక్ హక్కులను మనవాళ్లు తీసుకోగా, తాజాగా 'కప్పేలా' మూవీ రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేజిక్కించుకుంది. కొద్ది కాలం క్రితమే ఆ సంస్థ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ హక్కులు పొందడం, దాన్ని రవితేజ, రానా హీరోలుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలుగు ఒన్ పాఠకులకు తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం 'కప్పేలా' మూవీపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే ఆ సినిమాను మెచ్చుకుంటూ మరోవైపు తెలుగు సినిమాలపై అతను రాండమ్గా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇప్పుడు 'కప్పేలా' మూవీ రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పొందడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహమ్మద్ ముస్తఫా డైరెక్ట్ చేయగా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఉండే ఈ మూవీని యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్టర్తో తీసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.