'స్పైడర్'తో తీరలేదు.. 'సర్కారు వారి పాట'తో తీరేనా?
on Nov 23, 2020
సౌత్లో క్రేజ్ వున్న టాప్ స్టార్స్లో మహేశ్ బాబు ఒకరు. బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమాలు చేసే సందడే వేరు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదల తర్వాత రూ. 130 కోట్ల వసూళ్ల మార్కును దాటడంతో, రాబోయే సినిమా 'సర్కారు వారి పాట'పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆ సినిమా రూ. 150 కోట్లను టార్గెట్ చేసింది. దానికి శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా కలుపుకుంటే, అది చేసే బిజినెస్ ఈజీగా రూ. 200 కోట్లను దాటుతుంది. ఈ ప్రకారం చూస్తే, మహేశ్ క్రేజ్ రోజు రోజుకూ ఆడియెన్స్లో పెరుగుతోంది.
అయినప్పటికీ, తెలుగులో తమిళ హీరోలు సక్సెస్ అవుతున్నట్లుగా తమిళంలో తెలుగు హీరోలు సక్సెస్ కావట్లేదు. ఇదివరకు 'స్పైడర్' మూవీతో తమిళ ఆడియెన్స్ను ఆకట్టుకోవాలని మహేశ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా తమిళ వెర్షన్ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ తమిళ ప్రేక్షకుల్లో పాపులర్ అయిన టాలీవుడ్ హీరోల్లో మహేశ్దే అగ్ర స్థానం. తమిళనాడులో విడుదలయ్యే తెలుగు సినిమాల్లో ఎక్కువ వసూళ్లు వచ్చేది ఆయన సినిమాలకే. అందుకే 'సర్కారు వారి పాట'తో తమిళుల్లో మరింత ఇమేజ్ తెచ్చుకోవాలని ఈ సూపర్స్టార్ ట్రై చేస్తున్నాడు. విశేషమేమంటే, ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే దాని తమిళ వెర్షన్ శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం. అక్కడి టాప్ ఎంటర్టైన్మెంట్ చానల్స్లో ఒకటైన విజయ్ టీవీ 'సర్కారు వారి పాట' శాటిలైట్ హక్కులను మంచి రేటుకు కొనుగోలు చేయడం మహేశ్కు అక్కడి ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.
దానికి తగ్గట్లుగానే కోలీవుడ్లో ఈ సినిమాను భారీ ప్రచారంతో రిలీజ్ చేయాలని ఇప్పట్నుంచే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదెంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' తమిళ డబ్బింగ్ వెర్షన్ను అక్కడ రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట'ను మరింత భారీ స్థాయిలో విడుదల చేయాలని మహేశ్ ఆశిస్తున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్తోంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. 'స్పైడర్'తో సాధించని దాన్ని 'సర్కారు వారి పాట'తో మహేశ్ సాధిస్తాడా?
- YM
Also Read