'ఓ పిట్ట కథ'కు మహేశ్ సపోర్ట్
on Feb 6, 2020
ఇటీవలి కాలంలో మహేశ్ చిన్న సినిమాలకు తనవంతు పబ్లిసిటీ ఇస్తూ, వాళ్లకు ఉత్సాహాన్నిస్తూ వస్తున్నాడు. మొన్ననే ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'నీలి నీలి ఆకాశం'ను తన ట్విట్టర్, ఇన్స్టాగ్రాం అకౌంట్లలో లాంచ్ చేసి, ఆ సాంగ్ పాపులర్ అవడంలో తన వంతు పాత్ర పోషించిన ఆయన, తాజాగా మరో సినిమా టీజర్ను లాంచ్ చేసేందుకు అంగీకరించాడు. అది సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న 'ఓ పిట్ట కథ' మూవీ. శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 5.05 గంటలకు ఈ టీజర్ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మహేశ్ ఆవిష్కరించనున్నట్లు నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది.
బ్రహ్మాజీ కొడుకు హీరోగా పరిచయమవుతున్నాడనే కారణంతో 'ఓ పిట్ట కథ' సినిమాకు మొదట్నుంచీ మహామహులు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ని ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా, క్యారెక్టర్స్ పోస్టర్ను బుధవారం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించడం గమనార్హం. సంజయ్ రావుతో పాటు విశ్వంత్ దుద్దుంపూడి హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో నిత్యాశెట్టి హీరోయిన్. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో బ్రహ్మాజీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. వేసవిలో 'ఓ పిట్ట కథ'ను విడుదల చేయడానికి నిర్మాత వి. ఆనందప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read