మహేశ్ మొక్కలు నాటాడు.. తారక్కు ఛాలెంజ్ విసిరాడు!
on Aug 9, 2020
ఆగస్ట్ 9 మహేశ్ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్లో భాగస్వాములయ్యారు. ఫిల్మ్నగర్లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ, "ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో.. మొక్కలకి, జంతువులకి అంతే ఉంది. అన్ని జీవ జాలాన్ని సమానంగా చూడటమే నాగరికత అన్నారు పెద్దలు. కానీ మనం మాత్రం బంగళాలు కట్టడం, అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేసే ఎరువుల్ని వాడి అభివృద్ధి, నాగరికత అనుకుంటుంన్నాం. అందుకే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి" అన్నారు.
ఆయన దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా. "అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనాలాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం. ఇది జరగాలంటే ప్రతీ ఒక్కరు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలి, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలి. ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని ఛాలెంజ్ అనేకంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నాదీ, నీదీ అని కుంచించుకుపోయిన సమాజంలో ఇంత ఉదాత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందిని కదిలించడం అంటే మాములు విషయం కాదు. అందుకు సంతోష్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నా.. వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నా" అన్నారు.
ఆ తర్వాత ఆయన మరో ముగ్గురు ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ విజయ్, నటి శ్రుతి హాసన్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.
Also Read