చిరంజీవి నాకెప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు!
on Jan 10, 2020
'ఒక్కడు' మూవీ నుంచి చిరంజీవి గారెప్పుడూ తనకు సపోర్టివ్గా ఉంటున్నారని చెప్పాడు మహేశ్. "ఆయనకు ఆ సినిమా విపరీతంగా నచ్చింది. ఒక లెటర్ రాశారు. ఆయన వచ్చి నన్ను కలిశారు. ఫోన్లో మాట్లాడారు. 'అర్జున్' సినిమా కోసం మేం వేసిన మధుర మీనాక్షి టెంపుల్ సెట్కు వచ్చారు. సగం రోజు అక్కడే ఉండి, "మీలాంటోళ్లు ఇలా చేస్తే, మన ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిపోతుంది" అన్నారు. తన మాటలతో ఎంతో ఇన్స్పైర్ చేశారు. ఆయనెప్పుడూ నాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు" అని తెలిపాడు.
'పోకిరి' రిలీజైనప్పుడు, అది చూసి పూరి జగన్నాథ్ గారి ఆఫీసుకు చిరంజీవి వెళ్లారనీ, అక్కడ్నుంచి రాత్రి 8 గంటలకు ఫోన్చేసి నన్ను తనను రమ్మన్నారనీ ఆయన గుర్తు చేసుకున్నాడు. "నేను వెళ్లాక మూడు గంటల పాటు నాతో 'పోకిరి' గురించి మాట్లాడారు. రాత్రి 12 గంటల దాకా అక్కడే ఉన్నారు. నా పర్ఫార్మెన్స్ గురించి కానీ, సినిమా గురించి కానీ మాట్లాడి, 'ఎలా ఈ విధంగా చేశారు?'.. అని అడిగారు. ఏ సినిమా నాది రిలీజై హిట్టయినా, మొదటి ఫోన్ కాల్ ఆయన నుంచే వస్తుంది. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలు రిలీజైనప్పుడు ఆయన నుంచే ఫస్ట్ కాల్ అందుకున్నాను. ఇప్పుడు జనవరి 11న కూడా ఆయన నుంచే ఫోన్ కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్కు ఆయన వచ్చినందుకు హ్యాపీగా ఉంది" అని తెలిపాడు మహేశ్.