ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్!
on Jan 25, 2021
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి ఎవరికీ పద్మ పురస్కరాలు దక్కలేదు. దిగ్గజ గాయకుడు దివంగత ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్ ప్రకటించగా, సినీ రంగానికి సంబంధించి ఈ పురస్కారం దక్కింది ఒక్క బాలుకే కావడం గమనార్హం.
దక్షిణాదికి చెందిన పాపులర్ సింగర్ కె.ఎస్. చిత్రకు పద్మ భూషణ్ పురస్కారం లభించగా, మరో గాయని బాంబే జయశ్రీకి పద్మశ్రీ అవార్డ్ దక్కింది.
ఎస్పీ బాలు గాయకునిగా సుప్రసిద్ధులైనప్పటికీ, ఆయనది బహుముఖ ప్రజ్ఞ. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలెన్నో మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. నటునిగానూ తనదైన ముద్ర వేశారు. 'మిథునం'లో ప్రధాన పాత్రధారిగా ఆయన నటనకు లభించిన ప్రశంసలెన్నో. నిర్మాతగా ఉత్తమాభిరుచితో చిత్రాలను ఆయన నిర్మించారు. ఇక టెలివిజన్లో 'పాడుతా తీయగా' షో ద్వారా వందలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. గాయకునిగా తెలుగు, తమిళ భాషల్లో సమానంగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన ఆయన హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విరివిగా పాటలు పాడారు.
ఉత్తమ నేపథ్య గాయకునిగా ఆరుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయన సొంతం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాడిన పాటల ద్వారా ఆ అవార్డులు ఆయనకు లభించాయి. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కరాలు అందుకున్న ఆయనకు, ఇప్పుడు మరోసారి పదేళ్ల విరామంతో 2021లో పద్మ విభూషణ్ లభించడం గమనార్హం.
కొవిడ్ 19 బారినపడి నెల రోజుల పాటు చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన, కొవిడ్ తగ్గిపోయినప్పటికీ, శ్వాసరపమైన సమస్యలు ఎదుర్కొంటూ 2020 సెప్టెంబర్ 25న గుండెపోటుకు గురై, హాస్పిటల్లోనే కన్నుమూసి, తన అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు.