అలనాటి తార కృష్ణకుమారి ఇకలేరు
on Jan 24, 2018
అలనాటి అందాల నటి కృష్ణకుమారి ఇకలేరు.. ఆమె వయసు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. "నవ్వితే నవరత్నాలు" సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన కృష్ణకుమారి నాటి దక్షిణాది సూపర్స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ సరసన ఆడిపాడారు. కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు.. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్లోని నైహతీకి వలస వెళ్లింది.. అక్కడే 1933 మార్చి 6న కృష్ణకుమారి జన్మించారు. మరోనటి షావుకారు జానకీ ఈమెకు పెద్దక్క.
తన సుధీర్ఘ కెరీర్లో సుమారు 130కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి దీపిక అనే కుమార్తె ఉన్నారు. తెలుగునాట తొలి గ్లామరస్ హీరోయిన్గా, లేడీ ఓరియేంటేడ్ మూవీస్కి కేరాఫ్గా నిలిచిన కృష్ణకుమారి ఎన్టీఆర్తో అత్యధిక సినిమాల్లో నటించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ.. మూడు సార్లు జాతీయ అవార్డులు, నంది అవార్దులతో పాటు కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ అవార్డులు వరించాయి. బ్రిటన్లోని బర్మింగ్హామ్ సంస్థ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందారు. కృష్ణకుమారి మరణంపై దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.