శ్రీకాంత్ కి ఓటేసి తప్పు చేశా.. రిజైన్ చేసేవాళ్ళు అసలు నిల్చోటం ఎందుకు?
on Dec 3, 2021
అక్టోబర్ లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన మా అధ్యక్ష పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. విష్ణు ప్యానల్ కి మద్దతు తెలిపారు. అయితే ఎన్నికలు ముగిసిన కొన్నిరోజుల తర్వాత అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ కి ఓటేసి తప్పు చేశానని కోట సంచలన వ్యాఖ్యలు చేశారు.
విష్ణుకి మద్దతిచ్చినంత మాత్రాన తాను ఆ ప్యానల్ లో అందరికీ ఓటేసినట్లు కాదని మా ఎన్నికలు ముగిశాక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోట వ్యాఖ్యానించారు. ఓవైపు ప్రెసిడెంట్ గా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా మాత్రం శ్రీకాంత్ కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. అయితే శ్రీకాంత్ తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన మిగిలిన వాళ్లంతా రాజీనామా చేయడంతో.. శ్రీకాంత్ కి ఓటేసి తప్పు చేసానని కోట అప్పటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
తాజాగా కోట 'తెలుగు వన్' యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. 'హీరో శ్రీకాంత్ కి ఓటేసి తప్పు చేశాను' అన్నారన్న విషయాన్ని యాంకర్ గుర్తు చేయగా.. "రిజైన్ చేసే వాడికి ఓటేసి అనవసరంగా నా ఓటు వేస్ట్ చేసుకున్నాను అన్నాను. అందులో తెప్పేముంది?. నా ప్యానల్ గెలవకపోతే నేను రిజైన్ చేస్తామని ముందు మా ఎవరికీ చెప్పలేదు కదా. ముందే చెప్తే ఓటు ఇంకెవరికైనా వేసుకునే వాళ్ళం. రిజైన్ చేసేవాళ్ళు అసలు నిల్చోటమే వేస్ట్ కదా. అదే అడిగా.. తప్పేముంది" అని బదులిచ్చారు కోట.
Also Read