అనుష్కకు ఫ్లైట్లో కథ చెప్పాడట!
on Dec 2, 2019
అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’. ‘బాహుబలి’ రెండు భాగాలు, ‘భాగమతి’ చిత్రాల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. అందులోనూ చెవిటి, మూగ అమ్మాయిగా ఆమె ఎలా నటించిందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన సినిమా టీజర్కు రెస్పాన్స్ కూడా బాగుంది. అయితే, ఈ సినిమాలో మూగమ్మాయి సాక్షి పాత్రకు ముందుగా అనుష్కను అనుకోలేదు! మరో హీరోయిన్తో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఆమె కథ విని, డేట్స్ ఇచ్చారు. అయితే, ఈ సినిమా అంతటినీ అమెరికాలో షూటింగ్ చేయాలి. వీసాలు రావడం ఆలస్యం కావడంతో వేరే హీరోయిన్ ఇచ్చిన డేట్స్ కాస్తా అయిపోయాయి. ఆమె మరో సినిమా కమిట్ కావడంతో ‘నిశ్శబ్దం’ చేయలేనని చెప్పేశారు. ఆ తర్వాత అనుష్క ఈ సినిమాలోకి వచ్చారు. సినిమాలో నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ ఈ విషయం చెప్పారు.
దర్శకుడు హేమంత్ మధుకర్ రాసిన ఈ సినిమా కథకు కోన వెంకటే స్ర్కీన్ప్లే, డైలాగులు రాశారు. ముందుగా అనుకున్న హీరోయిన్ సినిమా నుండి తప్పుకోవడంతో వేరే హీరోయిన్ కోసం వెతకడం ప్రారంభించారు. ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్స్ను చెన్నై పంపించారట. అనుకోకుండా ఆ ఫ్లైట్లో కోన వెంకట్కి అనుష్క కలిశారు. ఇద్దరివీ పక్క పక్క సీట్లే. అప్పుడు ‘నిశ్శబ్దం’ కథను చెప్పేశారట. ఆమెకు నచ్చడంతో సినిమా చేశారు. వచ్చే ఏడాది జనవరి 31న సినిమా విడుదల చేస్తున్నామని చెప్పడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన వెంకట్ ఈ కథంతా చెప్పారు. దీన్ని తీస్తే పెద్ద సినిమా అవుతుందన్నారు.
Also Read