పవన్ కల్యాణ్లోని క్రియేటివిటీని తొలిసారి బయటపెట్టిన ఫిల్మ్ 'ఖుషి'
on Sep 21, 2020
"చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు".. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్కల్యాణ్ ఇమేజ్ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్కల్యాణ్. నిజం చెప్పాలంటే మెగాస్టార్గా నెంబర్వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్స్టంట్ హిట్.
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే.
పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్లో కోల్కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్ని ఇంకెంత సున్నితంగా నడపాలి!
పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు.
- బుద్ధి యజ్ఞమూర్తి