రామ్ చిత్రంలో కీర్తి సురేశ్?
on Sep 18, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన `నేను శైలజ`(2016)తో తెలుగునాట నాయికగా తొలి అడుగేసింది కేరళకుట్టి కీర్తి సురేశ్. మొదటి సినిమాతోనే ఇక్కడ ఓ మెమరబుల్ హిట్ ని తన సొంతం చేసుకుంది. ఆపై `నేను లోకల్`, `మహానటి` చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ డమ్ పొందిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా `సర్కారు వారి పాట`లో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్`లో దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం రామ్ తో మరోమారు జట్టుకట్టనుందట కీర్తి సురేశ్. ఆ వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ చిత్రంలో కీర్తి అతిథి పాత్రలో కాసేపు సందడి చేయనుందని కోలీవుడ్ బజ్. అదే గనుక నిజమైతే.. `సీమ రాజా` (తమిళ్), `మన్మథుడు 2`, `జాతిరత్నాలు` తరువాత కీర్తి స్పెషల్ రోల్ లో నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే రామ్ - లింగుస్వామి కాంబో మూవీలో కీర్తి ఎంట్రీపై క్లారిటీ రానుంది. అన్నట్టు లింగుస్వామి గత చిత్రం `సండకోళి 2` (తెలుగులో `పందెంకోడి 2`)లో కీర్తి సురేశ్ నే నాయికగా నటించింది.
మరి.. రామ్ సరసన నాయికగా కలిసొచ్చిన కీర్తి.. అతిథిగానూ అచ్చొస్తుందేమో చూడాలి.
Also Read