రజనీకాంత్ కూతురిగా కీర్తి సురేశ్!
on Dec 12, 2019
రజనీకాంత్ నటిస్తోన్న 168వ చిత్రం నిర్మాణ పనులు ఆయన పుట్టినరోజు (డిసెంబర్ 12)కు ఒక రోజు ముందు చెన్నైలో మొదలయ్యాయి. శివ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో రజనీ సరసన నాయికలుగా నటించిన మీనా, ఖుష్బూ ఈ మూవీలో నటిస్తున్నారు. వీరిలో రజనీ భార్యగా మీనా కనిపించనున్నది. 'యజమాన్', 'వీర', 'ముత్తు' సినిమాల తర్వాత రజనీ, మీనా కలిసి నటిస్తోన్న సినిమా ఇదే. అంటే 24 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ ఈ సినిమాతో జోడీ కడుతున్నారు. అలాగే 'పాండ్యన్', 'అన్నామలై' సినిమాల తర్వాత రజనీతో కలిసి ఖుష్బూ మళ్లీ నటిస్తోన్న మూవీ ఇదే. 27 ఏళ్ల తర్వాత ఆమె రజనీతో చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో ఆమె పాత్ర ఏమిటన్నది వెల్లడి కాలేదు. ప్రకాశ్ రాజ్ ఒక ప్రధాన పాత్ర చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం ఇదివరకే మనకు తెలుసు. మొదట్లో ఆమె రజనీ జోడీగా నటిస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి. అయితే ఆమె రజనీ కూతురిగా కనిపిస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. కీర్తి తల్లి మేనక గతంలో రజనీ సరసన నాయికగా 'నేట్రికన్' (1981)లో నటించిన విషయం గమనార్హం. ఈ సినిమా కోసం మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాని కీర్తి వదులుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్లో జాప్యం జరుగుతుండటంలో ఆమెకు కాల్షీట్ల సమస్య ఎదురైందనీ, దాంతో రజనీ సినిమాకు ప్రాధాన్యం ఇచ్చి, మణిరత్నం సినిమాని ఆమె వదులుకున్నదనీ కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. రజనీకాంత్ 167వ చిత్రం 'దర్బార్' జనవరి 15న విడుదలవుతోంది.
Also Read